YSRCP, ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

YSRCP, ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

YSRCP పేరు వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. YSR కాంగ్రెస్ పార్టీ అనే పేరును ఉపయోగించే హక్కు తమకే ఉందంటూ ‘అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ YSRCPతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ పేరుతో ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయిందని, తమదే నిజమైన ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అని మహబూబ్ బాషా కోర్టుకు తెలిపారు. YSR  పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టరైన పార్టీ ‘అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్’ ఒక్కటేనని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో YSRCP తమ పార్టీ పేరును అక్రమంగా ఉపయోగిస్తోందంటూ మహబూబ్ బాషా ఆరోపించారు. జగన్ అధ్యక్షుడిగా వున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు సెప్టెంబరు 3 లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని YSRCPతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.  తర్వాత విచారణను వాయిదా వేసింది.