- కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో రెండేళ్లుగా జరగని బిజినెస్
- ఈ సమ్మర్ పైనే ఆశలు పెట్టుకున్న వ్యాపారులు
హైదరాబాద్, వెలుగు: రెండేళ్లుగా సమ్మర్ సీజన్లో కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్తో పూర్తిగా ఆదాయం కోల్పోయిన మట్టి పాత్రల తయారీదారులు ఈ ఏడాదిపైనే చాలా ఆశలు పెట్టుకున్నారు. కరోనా తీవ్రత బాగా తగ్గడంతో ఈసారైనా బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు పనులను మొదలుపెట్టారు. మట్టి కుండలు, గ్లాసులు, పాత్రలు తదితర వస్తువులను తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. ఉగాది పండుగ, ఆ తర్వాత ఏప్రిల్, మే నెలలో ఎండలను దృష్టిలో పెట్టుకుని మట్టి వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉండొచ్చని చెప్తున్నారు. రెండేండ్లుగా బిజినెస్ లేకపోవడంతో కొందరు తయారీదారులు సామగ్రిని కూడా బయటకు తీయలేదు.
లక్షమందికి ఆధారం...
సిటీలో కుండలు తయారీ చేసే వారితో పాటు వాటిని అమ్మేవాళ్లు కూడా దాదాపు లక్షమంది వరకు ఉంటారు. సిటీకి చెందిన వారు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్లకూ ఇదే ఈ వృత్తే ఆధారం. ఏటా సీజన్ను బట్టి పని చేస్తుంటారు. మిగతా టైంలో ఆకర్షణీయమైన మట్టి పాత్రలు తయారు చేస్తారు. సమ్మర్లో వాటర్ బాటిల్ తరహాలో లీటర్ నీరు పట్టేలా.. మట్టి బాటిల్స్, గ్లాసులను తయారు చేస్తుంటారు. సమ్మర్లో వాడేందుకు ఎన్నో రకాల వస్తువులను కొత్తగా తయారు చేస్తున్నారు. రెండేండ్లుగా కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్తో మార్కెట్లోకి మట్టి వస్తువులు పెద్దగా రాలేదు. ఇప్పుడిప్పుడే అన్ని రకాల మట్టి వస్తువులు వస్తుండటంతో జనం కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. రానున్న రోజుల్లో మరింత డిమాండ్ ఉంటుందని వ్యాపారులు అంటున్నారు.
మహబూబ్నగర్ నుంచి మట్టి తెచ్చుకున్నం
సీజన్ని బట్టి మట్టి వస్తువులను తయారు చేస్తున్నం. కానీ సమ్మర్లోనే ఎక్కువ బిజినెస్ ఉంటుంది. మట్టితో చేసే కుండలు, గ్లాసులు, జగ్గులు, పాత్రలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. రెండేళ్లుగా కరోనా వల్ల బిజినెస్ లేదు. ఇప్పుడైనా బిజినెస్ అవుతుందని అనుకుంటున్నా. మట్టి కోసం చాలా ఇబ్బంది పడ్డం. సిటీలో దొరక్కపోవడంతో మహబూబ్ నగర్ జిల్లాలోని చెరువుల నుంచి మట్టిని తెచ్చుకుంటున్నం. కుమ్మరి సహకార సంఘాల ద్వారా మట్టిని ఉచితంగా ప్రభుత్వం అందజేయాలె.
– సుజాత, కార్వాన్
రెండేళ్లుగా ఇబ్బందులే...
ఏండ్లుగా మా కుటుంబీకులు ఇదే పనిపై ఆధారపడి పని చేస్తున్నారు. రెండేండ్ల కిందటి వరకూ వేసవి వస్తుందంటే మట్టి వస్తువుల తయారీపై దృష్టి పెట్టేవాళ్లం. కానీ కరోనా కారణంగా పనులు చేయలేకపోయాం. ఇప్పుడు సాధారణ పరిస్థితికి చేరుకోవడంతో మట్టి పాత్రలను తయారు చేస్తున్నం.
– శాంతమ్మ, అమీర్ పేట
ప్రభుత్వం ఆదుకోవాలె
కుమ్మరి పని వాళ్లను ప్రభుత్వం ఆదుకోవాలి. పని కోసం అవ సరమయ్యే కొత్త మెషీన్లను అందించాలి. నేను ఎంటెక్చదవుతూ అమ్మనాన్నలకు సాయంగా ఉంటూ కుండలను తయారు చేస్తున్న. వృత్తి నైపుణ్యత శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టి, కార్మిక శాఖ అందించే అన్ని స్కీమ్లను కుమ్మరులకు అందించాలి.
– రాజ్ కిరణ్, తాళ్ల గడ్డ