రోప్ వే ప్రమాద రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్

రోప్ వే ప్రమాద రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్

దేవ్గఢ్: ఝార్ఖండ్ దేవ్గఢ్ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో రోప్ వే కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన టూరిస్టులందరినీ భారత వాయుసేన కాపాడింది. 45 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ లో 47 మంది పర్యాటకులను ఎయిర్ ఫోర్స్ సిబ్బంది రక్షించారు. అయితే, ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో 12 మందికి తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేబుల్ కార్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లు, డజన్ల కొద్దీ సైనికులు శ్రమించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో పాటు ఆర్మీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ లో కలసి పని చేశాయని దేవ్ గఢ్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీ అన్నారు.

కేబుల్ కార్లలో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీళ్లను అందించారు. ఇదిలా ఉంటే.. ప్రమాదం తర్వాత సోమవారం సహాయక చర్యల్లో భయానక ఘటన చోటుచేసుకుంది. వైమానిక దళ సిబ్బంది ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో హెలికాప్టర్ నుంచి కిందపడి చనిపోయాడు. ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు ఎంఐ–17 హెలికాప్టర్లు రక్షణ చర్యల్లో పాల్గొన్నాయి. కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన ఒక వ్యక్తిని కాపాడేందుకు రక్షణ బలగాలు ప్రయత్నించాయి. అయితే గాల్లో ఉన్న హెలికాప్టర్ వద్దకు తాడు సాయంతో చేరుకోగలిగిన ఆ వ్యక్తి.. కాక్ పిట్ వద్దే వేలాడుతూ కనిపించాడు. అయితే అతడ్ని హెలికాప్టర్ లోపలకు లాక్కునేందుకు సైన్యం చేసిన యత్నాలు ఫలించలేదు. కాసేపటికే పట్టుతప్పి కిందపడిపోయి.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వెస్ట్ బెంగాల్ కు చెందిన వాడిగా గుర్తించారు. 

మరిన్ని వార్తల కోసం:

అక్బరుద్దీన్ కేసులో తీర్పు వాయిదా

ఒకప్పుడు సైడ్ యాక్టర్.. ఇప్పడు హ్యాట్రిక్ హీరో

పాక్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలె