
- మహాలక్ష్మి స్కీమ్తో సంస్థకు రూ.6,088 కోట్లు చెల్లించినం
- రాష్ట్రమంతా ఎలక్ట్రిక్ బస్సులు తెస్తామని వెల్లడి
సూర్యాపేట/ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజా ప్రభుత్వం వల్లే ఆర్టీసి బతికిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని వదిలించుకునే ప్రయత్నం చేస్తే తాము అధికారంలోకి వచ్చాక మహాలక్మి పథకంతో ఆర్టీసీకి రూ.6,088 కోట్లు చెల్లించి సంస్థను కాపాడామన్నారు. సోమవారం నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో భట్టి పాల్గొన్నారు. సూర్యాపేటలో 45 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. అలాగే ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో గౌడ సంఘం భవనం, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భట్టి మాట్లాడుతూ.. ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు. సరికొత్త ఆలోచనలతో ఆర్టీసీని నిలబెట్టేందుకు మంత్రి పొన్నం కృషి చేస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ కాలుష్యం బారిన పడకుండా ఓఆర్ఆర్ పరిధిలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను పొన్నం ప్రవేశపెట్టారని, రాష్ట్రమంతా దశలవారీగా ఈ బస్సులు తెచ్చే ఆలోచన ఉందన్నారు. వచ్చే రాష్ట్ర బడ్జెట్ లో జనాభా ప్రకారం నిధులు కేటాయిస్తామని, విద్య, ఉపాధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం ఇస్తామని భట్టి వెల్లడించారు. రఘునాథపాలెంలో ఏడాదిలోనే గౌడ సంఘం భవనాన్ని నిర్మించి ఇక్కడే నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయిస్తామన్నారు.
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం: పొన్నం
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ ఆర్టీసీని కాపాడుతున్నామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాలక్మి పథకం కింద ఆర్టీసీకి నెలకు రూ.350 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లో ఎలక్ట్రికల్ బస్సులు నడుస్తున్నాయని, త్వరలో నల్గొండలో కూడా ఎలక్ట్రికల్ చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసి బస్సులు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని కులాలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృషి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ కులగణన సక్సెస్ అయ్యిందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, మందుల సామెల్, మట్టా రాగమయి, రాందాస్ నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నాయుడు సత్యనారాయణ గౌడ్, రాయల నాగేశ్వరరావు, పటేల్ రమేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ , తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.