సెంచరీలతో చెలరేగిన ధోనీ, రాహుల్

సెంచరీలతో చెలరేగిన ధోనీ, రాహుల్

కార్డిఫ్‌‌: వరల్డ్‌‌కప్‌‌ ప్రారంభానికి ముందు టీమిండియా భారీ విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. న్యూజిలాండ్‌‌తో జరిగిన తొలి వామప్‌‌లో అట్టర్‌‌ఫ్లాప్‌‌ షో చేసిన టీమిండియా.. బంగ్లాదేశ్‌‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో 95  పరుగులతో విజయం సాధించింది. నాలుగో నంబర్‌‌లో బ్యాటింగ్‌‌కు వచ్చిన లోకేశ్‌‌ రాహుల్‌‌తోపాటు ఎంఎస్‌‌ ధోనీ సెంచరీలు చేసి టీమిండియా మిడిలార్డర్‌‌ బలంపై ప్రత్యర్థులకు తొలుత హెచ్చరికలు పంపగా, తర్వాత స్పిన్నర్లు చెలరేగి బంగ్లాను చిత్తు చేశారు. ధోనీ(78 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 113), రాహుల్‌‌(99 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108) సెంచరీలతో చెలరేగడంతో టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌‌శర్మ(19), శిఖర్‌‌ ధవన్‌‌(1) మరోసారి నిరాశపరచగా,  కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ(46 బంతుల్లో 5 ఫోర్లతో 47) రాణించాడు.  బంగ్లా తొమ్మిది మంది బౌలర్లను పరీక్షించగా రుబెల్‌‌ హుస్సేన్‌‌, షకీబల్‌‌ హసన్‌‌ రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌లో  బంగ్లా 49.3 ఓవర్లు ఆడిన 264 రన్స్‌‌కు ఆలౌటైంది. ముష్ఫికర్‌‌ రహీమ్‌‌(90), లిటన్‌‌ దాస్‌‌(73) హాఫ్‌‌ సెంచరీలతో రాణించారు. ఇండియా బౌలర్లలో కుల్దీప్‌‌ యాదవ్‌‌(3/47)తో టచ్‌‌లోకి రాగా, చహల్‌‌(3/55), బుమ్రా(2/25)  కూడా రాణించారు. జడేజాకు ఒక వికెట్​ దక్కింది.