జార్ఖండ్ డైనమైట్, ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
విదేశంలో వెస్టిండీస్ పై, స్వదేశంలో సౌతాఫ్రికా జరిగిన సిరీస్ లో ధోనీ అందుబాటులో లేడు. నవంబర్ నెలలో జరిగే బంగ్లాదేశ్ సిరీస్ కు ధోనీ ఎంపిక కాలేదు. దీంతో ధోనీ కెరియర్ పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వరల్డ్ కప్ పరాభవం తరువాత ఆర్మీకి సేవలందించేందుకు ధోనీ ఉపక్రమించాడు. ఓ వైపు సిరీస్ లలో ఆడకపోవడం, గత కొద్ది కాలంగా కెరియర్ పై అనేక అనుమానాలు తలెత్తడంతో ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ధోనీ రిటైర్మెంట్ మరోసారి సారి చర్చాంశనీయమైంది. సోషల్ మీడియాలో #dhoniretires, #thank you dhoni, #neverretiredhoni లాంటి యాష్ ట్యాగ్ లు ధోనీ అభిమానుల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. అయితే టీ20 వరల్డ్ కప్ వరకు ధోనీ ఆడాలంటూ అభిమానులు యాష్ ట్యాగ్ లతో హోరెత్తిస్తున్నారు.
ధోనీ రిటైర్మెంట్ పై బీసీసీఐ కూడా ఓ స్పష్టత రాలేకపోతుందని క్రికెట్ పండితులు చెప్పుకుంటున్నారు. ధోనీకి ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్ ఆకట్టుకోలేకపోవడంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు, అందుకే బోర్డ్ సభ్యులు సైతం ధోనీ రిటైర్మెంట్ పై స్పందించడం లేదని తెలుస్తోంది.
ఇటీవల బీసీసీఐ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సౌరబ్ గంగూలీ ..ధోనీ రిటైర్మెంట్ పై స్పందిస్తారని అందరూ అనుకున్నారు. రిటైర్మెంట్ ధోనీ చేతుల్లో ఉందని, దానిపై స్పష్టత ఇచ్చేందుకు తాను సిద్ధంగా లేనని దాదా సున్నితంగా తప్పుకున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవ్వడంతో ధోనీ రిటైర్మెంట్ పై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.


