చటాన్పల్లి.. గత నెల 27న అర్ధరాత్రి ‘దిశ’ను నలుగురు రాక్షసులు పెట్రోల్ పోసి కాల్చి చంపేసిన చోటు. సరిగ్గా పదిరోజులకు.. శుక్రవారం తెల్లవారుజామున అదే ప్రాంతంలో ఆ నలుగురు హతమయ్యారు. పోలీస్ ఎన్కౌంటర్లో అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న జనం భారీగా తరలివచ్చి.. పోలీసులకు జిందాబాద్లు కొట్టారు. పూలవర్షం కురిపించారు. దేశవ్యాప్తంగా యువతీయువకులు, మహిళలు రోడ్లమీదికి వచ్చి సంబురాలు జరుపుకున్నారు. సత్వర న్యాయం జరిగిందని హర్షం ప్రకటించారు.
గత నెల 29న దిశ కేసులో ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవులును అరెస్టు చేసిన పోలీసులు అటు తర్వాత విచారణ కోసం రిమాండ్లోకి తీసుకున్నారు. గచ్చిబౌలికి వచ్చి తిరిగి శంషాబాద్లోని ఇంటికి వెళ్తున్న వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ను నిందితులు అత్యంత పాశవికంగా అత్యాచారం, హత్య చేయడం దేశం మొత్తాన్ని కదిలించింది. ‘జస్టిస్ ఫర్ దిశ’ పేరిట నిరసనలు హోరెత్తాయి. పార్లమెంట్ను కూడా ఈ ఘటన కుదిపేసింది.
ఈ క్రమంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం శుక్రవారం తెల్లవారుజామున నలుగురు నిందితులను ‘దిశ’ హత్య జరిగిన హైదరాబాద్ నగర శివారులోని చటాన్పల్లి అండర్ బ్రిడ్జి వద్దకు తీసుకువెళ్లారు. ఇదే అదునుగా పారిపోయేందుకు ప్రధాన నిందితుడు ఆరిఫ్ మిగతా ముగ్గురికి సైగ చేశాడు. వారంతా కలిసి పోలీసులపైకి రాళ్లు, కట్టెలు విసిరారు. ఆరిఫ్, చెన్నకేశవులు పోలీసుల నుంచి తుపాకులు గుంజుకొని కాల్పులు జరిపారని, సరెండర్ కావాలని చెప్పినా వినలేదని సీపీ సజ్జనార్ తెలిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.