
- కేసీఆర్, చినజీయర్ మధ్య దూరం బట్టబయలు
- యాదాద్రి ప్రారంభోత్సవానికి జీయర్ను పిలువని సీఎం
- సమతామూర్తి విగ్రహావిష్కరణ నుంచి ఇద్దరి మధ్య అంతరం
- యాదాద్రి ప్రారంభోత్సవానికి గవర్నర్కూ అందని ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్, చినజీయర్ మధ్య గ్యాప్ నిజమేనని తేలిపోయింది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో అన్నీ తానై వ్యవహరించిన చినజీయర్ లేకుండానే సీఎం కేసీఆర్ ఆలయాన్ని ప్రారంభించారు. చినజీయర్ నిర్ణయించిన ముహూర్తానికే వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ చేశారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో వీరిద్దరి మధ్య అంతరం మొదలైంది. తాము ఎవరితో గ్యాప్ పెట్టుకోబోమని, ఎవరైనా పెట్టుకుంటే తాము చేసేదేమీ లేదని మొన్నామధ్య ప్రెస్మీట్లో జీయర్ పేర్కొనగా.. ‘‘చినజీయర్తో గ్యాప్ వచ్చిందని మీకు ఎవరు చెప్పారు.. మీకెట్లా తెలిసింది.. అంతా గ్యాస్..’’ అని సీఎం కేసీఆర్ ఇటీవల మీడియాతో అన్నారు.
అయితే.. ఆలయ పునః ప్రారంభానికి మాత్రం జీయర్ను పిలువలేదు. గవర్నర్ తమిళిసైని కూడా ఈ ఉత్సవానికి ప్రభుత్వం ఆహ్వానించలేదు. మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులు మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. చినజీయర్, గవర్నర్ లేకుండానే యాదాద్రి ఆలయాన్ని ప్రారంభించడం చర్చనీయాంశమైంది.
రాష్ట్ర ఆవిర్భావం నుంచి సాన్నిహిత్యం
తెలంగాణ ఆవిర్భావం నుంచి కేసీఆర్, చినజీయర్ మధ్య సాన్నిహిత్యం ఉంది. జీయర్ భక్తుడిగా చెప్పుకునేందుకు కేసీఆర్ ఏమాత్రం సందేహించేవారు కాదు. సీఎం హోదాలో పలుమార్లు ముచ్చింతల్లోని జీయర్ ఆశ్రమాన్ని సందర్శించుకొని, ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఇంటిల్లిపాదిని తీసుకెళ్లి జీయర్ ఆశీర్వచనం అందుకునేవారు. కేసీఆర్ మానసపుత్రికగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ చినజీయర్కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కొండపోచమ్మసాగర్ ప్రారంభానికి జీయరే చీఫ్ గెస్ట్. సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ ప్రారంభోత్సవంలోనూ జీయర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఓసారి సీఎం కూర్చీలో జీయర్ను కేసీఆర్ కూర్చోబెట్టారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో చిన జీయర్దే కీలకపాత్ర. ఆలయ నిర్మాణానికి అంకుర్పారణ మొదలు మహాకుంభ సంప్రోక్షణ వరకు అన్నీ ఆయన డైరెక్షన్లోనే చేశారు. పలుమార్లు ప్రత్యేక హెలికాప్టర్లో జీయర్ను కేసీఆర్ వెంటబెట్టుకొని నిర్మాణ పనులను పరిశీలించారు. జీయర్ సూచనలతో పలు మార్పులుచేశారు. యాదాద్రికి సంబంధించిన ఏ పని చేయాలన్నా జీయర్ సూచన తప్పనిసరిగా పెట్టుకున్నారు. నిరుడు డిసెంబర్లో కేసీఆర్ ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లి జీయర్తోనే ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణ నుంచి..
ముచ్చింతల్ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహావిష్కరణ నుంచి సీఎం కేసీఆర్, చినజీయర్కు మధ్య గ్యాప్ వచ్చింది. విగ్రహావిష్కరణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు వీవీఐపీలు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. అప్పటివరకు ఏర్పాట్లు చేయటంతోపాటు ఉత్సవాలపై అధికారులతో సమీక్షించిన కేసీఆర్.. ప్రధాని మోడీ వచ్చినప్పటి నుంచి చినజీయర్కు దూరంగా ఉంటున్నారు. ప్రధానితో పాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సహా ఎవరు వచ్చినా కేసీఆర్ ముచ్చింతల్ వైపు కన్నెత్తి చూడలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా కేసీఆర్ తమకు ఎంతో తోడ్పాటు అందించినట్లు చినజీయర్ చెప్పినా ఫలితం లేకపోయింది. కేసీఆర్తో గ్యాప్పై ఈనెల 18న గుంటూరులో మీడియా అడిగిన ప్రశ్నలకు చినజీయర్ స్పందిస్తూ.. ‘‘మాకు ఎవరితోనూ గ్యాప్స్ ఉండవు... వాళ్లకు వాళ్లు ఎవరైనా గ్యాప్స్ పెట్టుకుంటే మేము చేయగలిగింది ఏమీ లేదు.. మేము దేంట్లోనూ పూసుకొని తిరిగేవాళ్లం కాదు.. ఎవరైనా దేనికైనా సలహా అడిగితే చెప్పడం మా బాధ్యత.. యాదాద్రి ప్రారంభోత్సవానికి పిలిస్తే వెళ్తాం.. లేదంటే చూసి ఆనందిస్తాం..’’ అని అన్నారు. ఆ తర్వాత మూడు రోజులకు(ఈ నెల 21న) కేసీఆర్ అదే విషయంపై తెలంగాణభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘చినజీయర్తో గ్యాప్ వచ్చిందని మీకు ఎవరు చెప్పారు.. మీకెట్లా తెలిసింది.. అంతా గ్యాస్.. ఇలాంటి చిల్లర ప్రశ్నలకు నేను సమాధానం చెప్ప..’’ అని అన్నారు. కానీ, యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఇద్దరి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపించింది.
గవర్నర్నూ పిలువలే
యాదాద్రి పునః ప్రారంభానికి రాష్ట్రపతి, ప్రధాని సహా దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వాని స్తామని, వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. తీరా ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులకే పరిమితం చేశారు. గవర్నర్ తమిళి సైని కూడా ఆహ్వానించలేదు. మొన్నామధ్య గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు.