కరోనా పేషెంట్లకు ‘పిర్ ఫెనిడోన్’ వాడొద్దు

కరోనా పేషెంట్లకు ‘పిర్ ఫెనిడోన్’ వాడొద్దు

న్యూఢిల్లీసీరియస్ కండిషన్ లో ఉన్న కరోనా పేషెంట్లకు పిర్ ఫెనిడోన్ వంటి యాంటీఫైబ్రోటిక్, మిథిలీన్ బ్లూ వంటి ఆక్సిడేషన్ రిడక్షన్ ఏజెంట్ మందులను వాడొద్దని డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య శాఖ, ఢిల్లీ ఎయిమ్స్ సూచించాయి.  కరోనా పేషెంట్ల ట్రీట్ మెంట్ కు ఏ మందులు వాడాలి? ఏవి వాడకూడదన్నవివరాలతో కేంద్రం ఈ మేరకు ‘ఫ్యాక్ట్స్​ ఆన్ కొవిడ్-19’ పేరుతో డాక్యుమెంట్ ను రిలీజ్ చేసింది. మైల్డ్, మోడరేట్ కేసుల్లో ఫావిపిరావిర్ యాంటీవైరల్ మందును, మోడరేట్, సివియర్ కేసుల్లో టోసిలిజుమాబ్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ డ్రగ్ ను వాడొచ్చని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇదివరకే అప్రూవ్ చేసింది. అయితే ఈ మందులను కూడా కరోనా పేషెంట్లకు వాడొద్దని తాజాగా ఎయిమ్స్ సూచించింది. ‘‘మైల్డ్, అసింప్టమాటిక్ కేసుల్లో ఫావిపిరావిర్ వాడటం వల్ల పేషెంట్లు కోలుకోవడానికి ఇబ్బంది అవుతోంది. ఇలాంటి కేసుల్లో సపోర్టివ్ కేర్, మానిటరింగ్ ఉంటే చాలు. ఇతర థెరపీలేమీ అవసరం లేదు. ప్రస్తుతం ఫావిపిరావిర్ వాడకాన్ని రికమెండ్ చేయడం లేదు’’ అని డాక్యుమెంట్ లో ఎయిమ్స్ పేర్కొంది.

రెమ్ డెసివిర్ కూడా వద్దు..

ప్యాండెమిక్ సమయంలో ఎమర్జెన్సీ యూజ్ కోసమే ఇలాంటి మందులకు డ్రగ్ రెగ్యులేటర్ సంస్థలు అనుమతి ఇస్తుంటాయని ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ అంజన్ త్రిఖా చెప్పారు. ఈ మందులను వాడటం ఇల్లీగల్ కాదని, కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న మందులనే వాడాలని తాము సూచిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. టోసిలిజుమాబ్ మందు లిమిటెడ్ గానే పనిచేస్తుందని, దానిని సైటోకైన్ సిండ్రోమ్ ఉన్న పేషెంట్లకు మాత్రమే వాడాలన్నారు. కరోనా అనుమానిత పేషెంట్లకు, డిశ్చార్జ్ అయినవారికి టోసిలిజుమాబ్ లేదా రెమ్ డెసివిర్ ను ఇవ్వరాదన్నారు. ఇలాంటి మందుల వల్ల సడెన్ కార్డియాక్ అరెస్ట్, సైలెంట్ హైపాక్సియా, పల్మనరీ థ్రాంబోంబాలిజం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. హార్ట్, లంగ్ డిసీజెస్ ఉన్న కోమార్బిడ్ పేషెంట్లను నిరంతరం జాగ్రత్తగా మానిటర్ చేయాలని, వారికి యాంటీకోయాగ్యులెంట్ మందులను వాడాలని డాక్టర్లు సూచించారు. మోడరేట్, సివియర్ కేసుల్లో డెక్సామిథసోన్, మిథైల్ ప్రిడ్నిసోలన్ వంటి కార్టికోస్టిరాయిడ్ మందులను వాడొచ్చని పేర్కొన్నారు.