అయోధ్యలో భారీ అగ్ని ప్రమాదం.. రామ మందిరానికి 800 మీటర్ల దూరంలో.. కాలి బూడిదైన యాగశాల

అయోధ్యలో భారీ అగ్ని ప్రమాదం.. రామ మందిరానికి 800 మీటర్ల దూరంలో.. కాలి బూడిదైన యాగశాల

అయోధ్య: అయోధ్యలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయోధ్య రామ మందిరానికి సరిగ్గా 800 మీటర్ల దూరంలో యాగం జరిగిన యాగ శాలలో అగ్ని ప్రమాదం జరిగింది. యాగ నిమిత్తం వేసిన పందిరి మొత్తం మంటల్లో తగలబడిపోయింది. దాదాపు ఒక ఎకరంలో ఈ యాగం నిమిత్తం పందిర్లు వేశారు. ఈ యాగ శాల ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ మంత్రి దయశంకర్ సింగ్కు చెందినదిగా పోలీసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తొమ్మిది రోజులుగా లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం ఈ యాగ శాలలో జరుగుతుంది.

యాగం ముగిసే రోజు కావడంతో దాదాపు 50 వేల మంది వరకూ ఈ యాగానికి హాజరయ్యారు. యాగం ముగిసి అందరూ వెళ్లిపోయిన గంటన్నర తర్వాత ఈ అగ్ని ప్రమాదం జరిగింది. యాగ క్రతువులో భాగంగా.. హోమ గుండం దగ్గర కొబ్బరి కాయ కొడుతున్న సమయంలో ఆ కొబ్బరి కాయ పొరపాటున హోమ గుండంలో పడటంతో నిప్పు రవ్వలు పందిరికి అంటుకుని ఈ అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం. పలుచటి వస్త్రాలు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

నిమిషాల్లోనే యాగ శాల మొత్తం కాలి బూడిదైంది. మంటలు పెద్ద ఎత్తున గాల్లోకి లేచాయి. ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మంటలు ఆరిపోయినప్పటికీ అక్కడ మొత్తం అప్పటికే కాలి బూడిదైన దృశ్యాలు కనిపించాయి.

ఈ అగ్ని ప్రమాదం యాగం ముగిశాక జరగడం.. అక్కడ ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. యజ్ఞం కోసం 12 వందల 51 హోమ గుండాలు ఏర్పాటు చేశారు. 5 వేల మందికి పైగా యాగం చేశారు. పది ఫైర్ ఇంజన్లు రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.