ఏడేళ్ల కిందట చెన్నైలో సంచలనం సృష్టించిన నటి సంధ్య కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది.శరీర భాగాలు మాత్రమే లభించిన ఈ కేసును ట్యాటూల ద్వారా ఛేదించారు పోలీసులు. ఈ కేసులో సంధ్య భర్త అయిన ఫిల్మ్ మేకర్ బాలకృష్ణన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 జనవరిలో చెన్నైలోని ఒక డంప్యార్డ్ సమీపంలో మహిళ శరీర భాగాలు లభించడం కలకలం రేపింది.
ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించేందుకు బహిరంగ ప్రకటనలు జారీ చేశారు. లభించిన శరీర భాగాల మీద ఉన్న ట్యాటూ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో మృతురాలు నటి సంధ్య అని తేల్చారు పోలీసులు. ఆమె తల్లి కూడా ఆ ట్యాటూలు చూసి తన కూతురేనని నిర్ధారించారు. డీఎన్ఏ పరీక్షలతో అది సంధ్య మృతదేహమేనని కన్ఫార్మ్ చేశారు డాక్టర్లు.
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు సంధ్య భర్త బాలకృష్ణన్ ను నిందితుడిగా తేల్చి అరెస్ట్ చేశారు. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలే హత్యకు కారణమని వెల్లడించారు పోలీసులు. అయితే.. పోలీసులు ఎంతగా గాలించినా సంధ్య తల, ఒక చేయి మాత్రం ఇప్పటికీ లభ్యం కాలేదు. అప్పట్లో సంధ్య మృతదేహాన్ని గుర్తించడంలో పోలీసులకు ఎదురైన ఛాలెంజెస్, ట్యాటూల ద్వారా కేసును ఛేదించిన తీరు హాట్ టాపిక్ గా మారింది.
మృతదేహం కోసం డంపింగ్ యార్డుల్లో గాలింపు:
ఇతర శరీర భాగాల కోసం చెన్నై సిటీలోని డంపింగ్ యార్డులన్నీ జల్లెడ పట్టారు పోలీసులు. ఒక ప్రత్యేక బృందంతో చెన్నై చరిత్రలోనే అతిపెద్ద గాలింపు చేపట్టారు. పల్లికరనై డంప్యార్డ్లో దాదాపు 11వేల 700 టన్నుల చెత్తను జల్లించారు పోలీసులు. ఈ క్లిష్టమైన ఆపరేషన్ ఫలితంగా సంధ్య మొండెం, మరికొన్ని శరీర భాగాలు లభించాయి.
అతిపెద్ద ఆపరేషన్ చేపట్టినా సంధ్య తల, ఎడమ చేయి మాత్రం లభించలేదు. తమిళనాడు వ్యాప్తంగా లభించిన గుర్తు తెలియని మృతదేహాలను పరిశీలించినా... ఫోటోలు, ఇతర వివరాలు అన్ని పోలీస్ స్టేషన్స్ కి పంపించి మీడియాలో యాడ్స్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఇప్పటికీ సంధ్య మృతదేహం ఏమైంది అన్నది రహస్యంగానే మిగిలిపోయింది.
