కుక్కకు ఘనంగా సంవత్సరికం చేసిన యజమాని

కుక్కకు ఘనంగా సంవత్సరికం చేసిన యజమాని

మనుషులనే పట్టించుకోని ఈ రోజుల్లో చనిపోయిన ఓ శునకానికి సంవత్సరికం చేశారు. తిరుపతిలోని రేణిగుంట పట్టణం పాంచాలినగర్లో గురువారం ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన ఫరీద్ బాబా కుటుంబసభ్యులు 12 ఏళ్ళ నుంచి ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి స్నూపి అని పేరు  పెట్టారు.  స్నూపి కూడా తమ బిడ్డగా భావించి కుటుంబ సభ్యునిగా ఆదరించారు.అనారోగ్యంతో 2019 జనవరి 9వ తేదీన శునకం చనిపోయింది. చనిపోయినప్పుడు దశదిన కర్మ నిర్వహించి అన్నదానం చేశారు. ఏడాదైనా దాని జ్ఞాపకాలను మరిచిపోని  ఫరీద్.. సంవత్సరికం సందర్భంగా స్నూపి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీధిలోని శునకాలకు చికిన్ బిరియాని పెట్టి , పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఫరీద్ బాబా మాట్లాడుతూ 13 సంవత్సరాలు తమ కుటుంబంతో కలిసిపోయిన స్నూపి  లేదన్న ఆవేదన వెంటాడుతుందన్నారు. స్నూపి ఆత్మ శాంతించాలని ఉదయాన్నే కుటుంబ సభ్యులంతా సమాధి వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించామన్నారు.