నాగర్​కర్నూల్ లో అవిశ్వాసానికి దూరం : వంశీకృష్ణ

నాగర్​కర్నూల్ లో  అవిశ్వాసానికి దూరం : వంశీకృష్ణ
  • ఆరు నెలల కోసం ఎందుకు బద్నాం
  • జడ్పీ, మండల, మున్సిపల్​ చైర్మన్లను వదిలేయాలని నిర్ణయం 
  • వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తామంటున్న డీసీసీ అధ్యక్షుడు 

నాగర్​కర్నూల్, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని వివధ జడ్పీ, మండల, మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెడుతుండగా, నాగర్​కర్నూల్​ జిల్లా రాజకీయాలు అందుకు భిన్నంగా నడుస్తున్నాయి. బీఆర్ఎస్​ నుంచి గెలిచిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరేందుకు ఆరాటపడుతున్నా పార్టీ జిల్లా నాయకత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వడం లేదు.

 జడ్పీలో కాంగ్రెస్​కు స్పష్టమైన మెజార్టీ​ఉన్నా జడ్పీ చైర్​పర్సన్​పై అవిశ్వాసం పెట్టేది లేదని అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డా.వంశీకృష్ణ స్పష్టం చేశారు. 3 నెలల చైర్మన్​ కుర్చీ కోసం అవిశ్వాసం పెట్టి బద్నాం కావడం దేనికని అంటున్నారు. నాగర్​ కర్నూల్,​ కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట మున్సిపాలిటీల్లో కొల్లాపూర్​లో కాంగ్రెస్​కు స్పష్టమైన ఆధిక్యత ఉంది. అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్​కర్నూల్​లో బీఆర్ఎస్​ కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరేందుకు ఎమ్మెల్యేలు, లోకల్​ లీడర్లను సంప్రదిస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. 

కాంగ్రెస్​కు బలం ఉన్నా..

నాగర్​ కర్నూల్​ జిల్లా పరిషత్​లో 20 జడ్పీటీసీ స్థానాలుంటే బీఆర్ఎస్​ 17 చోట్ల, కాంగ్రెస్​ మూడు స్థానాల్లో గెలిచింది. తెల్కపల్లి నుంచి గెలిచిన పద్మావతి జడ్పీ చైర్​పర్సన్​గా ఎన్నిక కాగా, అధిక సంతానం కేసులో అనర్హత వల్ల పదవికి దూరమయ్యారు. కోర్టు తీర్పుతో అక్కడి కాంగ్రెస్​ అభ్యర్థి జడ్పీటీసీగా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్​ బలం నాలుగుకు చేరింది.

 అసెంబ్లీ ఎన్నికల ముందు జడ్పీ వైస్​ చైర్మన్​ బాలాజీ సింగ్​ అచ్చంపేట, ఉప్పునుంతల, పెద్దకొత్తపల్లి, బిజినేపల్లి జడ్పీటీసీలతో పాటు మరి కొందరు కాంగ్రెస్​లో  చేరారు. దీంతో జడ్పీలో కాంగ్రెస్​ బలం 11కు చేరింది. ఎక్స్​అఫిషియో సభ్యులుగా నలుగురు ఎమ్మెల్యేలతో కలిపి అవిశ్వాసం పెట్టేందుకు సంఖ్యా బలం ఉన్నా సముఖంగా లేదని తెలుస్తోంది. కొల్లాపూర్​ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు 11 వార్డుల్లో గెలిచారు. బీఆర్ఎస్​ అభ్యర్థులు 9 వార్డుల్లో గెలిచారు. 

ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డిని ఎక్స్​ అఫిషియో సభ్యులుగా నామినేట్​ చేయించి వారి సపోర్ట్​తో మున్సిపల్​ చైర్మన్​ కుర్చీ సాధించుకుంది. కాంగ్రెస్​ సర్కారు ఏర్పడి జూపల్లి మంత్రిగా ప్రమాణం చేయడంతో కొల్లాపూర్​ మున్సిపాలిటీలో అవిశ్వాసం పెడతారనే చర్చ మొదలైంది. మరో ఇద్దరు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరడంతో కాంగ్రెస్​ బలం 13కు చేరింది. ఇక్కడ చైర్మన్​ను మార్చేందుకు పూర్తిగా అవకాశాలున్నాయి. అచ్చంపేటలో 20 వార్డులు ఉండగా, కాంగ్రెస్​కు ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. బీఆర్ఎస్​ కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరేందుకు క్యూ కడుతున్నా ఎమ్మెల్యే వంశీకృష్ణ తిరస్కరిస్తున్నట్లు సమాచారం.  

అన్ని స్థానాలు మావే..

మూడు నెలల కోసం దింపేశామనే బద్నాం ఎందుకు మోయాలని డీసీసీ అధ్యక్షుడు డా.వంశీకృష్ణ ప్రశ్నిస్తున్నారు. జడ్పీ, ఎంపీపీ స్థానాలతో పాటు నాలుగు మున్సిపాలిటీలను క్లీన్​స్వీప్​ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్​ కౌన్సిలర్లు కాంగ్రెస్​ పార్టీలో చేరుతామని వస్తున్నారని, అయితే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా పార్టీనే నమ్ముకుని ఉన్నవాళ్లను కాపాడుకోవడమే తమకు ముఖ్యమన్నారు. నాగర్​ కర్నూల్​ లోక్​సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల కాంగ్రెస్​ అభ్యర్థులు గెలిచారని, అలంపూర్, గద్వాలలో పట్టు సాధించడం తమకు పెద్ద పని కాదని అంటున్నారు.