ఖమ్మం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీల అభివృద్ధి కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదని ముస్లిం యువకులు మండిపడుతున్నారు. రెండేళ్ల నుంచి డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్ లబ్ధిదారులకు కార్లు ఇవ్వడం లేదని ఫైర్ అవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్ కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2019–-20లో అప్లికేషన్లు తీసుకున్నారు. అన్ని జిల్లాల నుంచి 20 వేల మంది వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నారు. ఇందులో 14 వేల మందికి పైగా ఇంటర్వ్యూలు నిర్వహించి, 7 వేల మందిని అర్హులుగా ప్రకటించారు. కానీ ఏడాది దాటుతున్నా ఇంతవరకు అర్హులను ఫైనల్ చేయలేదు. దీంతో అప్లికేషన్లు పెట్టుకున్న లబ్ధిదారులు ఆఫీసర్ల నుంచి సమాచారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో ఆరుగురికేనట..
ఖమ్మం జిల్లాకు సంబంధించి 2019-–20లో ఆన్ లైన్ద్వారా 375 మంది కార్ల కోసం అప్లై చేసుకున్నారు. వారిలో జిల్లా స్థాయిలో ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 196 మంది అటెండయ్యారు. ఈ లిస్ట్ నుంచి అర్హులను ఎంపిక చేయడం కోసం స్టేట్ లెవల్ కమిటీకి ఆఫీసర్లు పంపించారు. కానీ ఈ జిల్లాకు కేవలం రూ. 27 లక్షలు కేటాయించడంతో ఆరుగురికి మాత్రమే కార్లు ఇవ్వనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 134 మంది అప్లై చేసుకుంటే 67 మందిని ఎంపిక చేశారు. ఫైనల్గా నలుగురికి మాత్రమే కార్లు ఇవ్వనున్నారు. దీంతో నిరుద్యోగ మైనారిటీ యువకులు నిరాశ చెందుతున్నారు. రెండేళ్లు దాటుతున్నా కార్లు ఇవ్వకపోవడం, తుది లబ్ధిదారులను ప్రకటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సర్కారు మోసం చేస్తోంది
నిరుద్యోగ ముస్లిం యువకులను టీఆర్ఎస్సర్కార్మోసం చేస్తోంది. డ్రైవర్ఎంపవర్మెంట్ స్కీమ్కోసం యూత్ నుంచి ఆన్లైన్అప్లికేషన్లు తీసుకొని రెండేళ్లవుతున్నా కార్లు ఇవ్వడం లేదు. అప్లై చేసుకున్న వారిలో అర్హులుగా ప్రకటించిన 7 వేల మంది ఇప్పటికీ కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్వ్యూలు నిర్వహించి నెలలవుతోంది. కార్లు ఇంకెప్పుడిస్తరు.
- యాకూబ్పాషా, మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నం
2019లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నా. గతేడాది కొవిడ్ కంటే ముందే ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కూడా చేశారు. అప్పటి నుంచి ఫైనల్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నా. డ్రైవర్ను ఓనర్గా చేసే ఇలాంటి మంచి స్కీమ్ లను ప్రతి యేటా అమలు చేస్తే బాగుంటుంది. జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్లో ఎన్నిసార్లు అడిగినా కొవిడ్ కారణంగా ఆలస్యమవుతోందని చెబుతున్నారు.
- సల్మాన్ షేక్, ఖమ్మం
జాబితాను ఉన్నతాధికారులకు పంపించాం
జిల్లా స్థాయిలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత సెలక్ట్ అయిన అభ్యర్థుల లిస్టును ఉన్నతాధికారులకు పంపించాం. రాష్ట్ర స్థాయి కమిటీ తుది లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. కొవిడ్ కారణంగా లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమైన మాట వాస్తవమే. త్వరలోనే లిస్ట్ ఫైనల్ చేసి వెహికల్స్ను అందించే అవకాశముంది.
- గుడికందుల జ్యోతి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్, ఖమ్మం