
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు 10 అలంకారాలలో దుర్గమ్మ…భక్తులకు దర్శనమివ్వనున్నారు. కరోనా కారణంగా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈసారి అమ్మవారి దర్శనానికి అనుమతిని ఇవ్వనున్నారు ఆలయాధికారులు.
అమ్మవారి అలంకారాలు:
మొదటి రోజైన అక్టోబర్ 17న శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి గా భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారు. రెండో రోజు 18న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా, మూడో రోజు 19న శ్రీ గాయత్రీ దేవి,నాలుగవ రోజున 20న శ్రీ అన్నపూర్ణాదేవిగా,ఐదవ రోజు 21న మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవి,ఆరవ రోజు 22న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, ఏడవ రోజు 23 న శ్రీ మహాలక్ష్మీ దేవి, ఎనమిదవ రోజు 24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. తొమ్మిదవ రోజు 25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ కనిపించనున్నారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది. దీంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి.