రాంచీ: వరల్డ్ చాంపియన్షిప్స్లో నిరాశ పరిచిన ఇండియా స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ మరోసారి నేషనల్ రికార్డు బద్దలు కొట్టింది. రాంచీలో జరుగుతున్న నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 100 మీటర్ల రేస్లో గోల్డ్ మెడల్ నెగ్గే క్రమంలో తన పేరిటే ఉన్న నేషనల్ రికార్డు టైమింగ్ను మెరుగుపరుచుకుంది. శుక్రవారం సెమీఫైనల్లో ఒడిశా అథ్లెట్ ద్యుతీ 11.22 సెకండ్ల టైమింగ్ నమోదు చేసింది.
దాంతో, ఏప్రిల్లో ఏషియన్ చాంపియన్షిప్ సందర్భంగా 11.26 సెకండ్లతో తాను నెలకొల్పిన నేషనల్ రికార్డు టైమింగ్ను అధిగమించింది. అయితే ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ మార్క్ (11.15 సె)ను మాత్రం అందుకోలేకపోయింది. అనంతరం ఫైనల్ రేస్ను 11.25 సెకండ్లలో పూర్తి చేసిన ద్యుతీ టైటిల్ నెగ్గింది. తమిళనాడు అథ్లెట్ అర్చన (11.54 సె) సిల్వర్, రైల్వేస్ ప్లేయర్ హిమశ్రీ (11.57 సె) కాంస్యం గెలిచారు.


