దేశంలోని ప్రధాన సిటీలకు భూకంప ముప్పు పొంచి ఉంది. ఎత్తైన బిల్డింగులు కట్టిన చోట ఆ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. 14 సిటీలు ‘హై రిస్క్’ జోన్లో ఉన్నాయి. మరో 15 నగరాలు మీడియం రిస్క్ జోన్లో ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్అథారిటీ (ఎన్డీఎంఏ), ట్రిపుల్ఐటీ– హైదరాబాద్ కలిసి చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. దాదాపు 13 ఏళ్ల పాటు 50 నగరాలపై స్టడీ చేసిన తర్వాత ఎన్డీఎంఏ ఇటీవల ఎర్త్క్వేక్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్ పేరిట రిపోర్టును విడుదల చేసింది. స్టడీ చేసిన 50 సిటీల్లోని 25 సిటీలు, నిర్మాణాలు ఎక్కువ చేపట్టిన ప్రాంతాల్లో తిరిగి డేటాను తీసుకుంది. ఆ డేటా ఆధారంగా కంప్యూటర్ మోడల్ను తయారు చేసి సిటీలకు భూకంప ముప్పును లెక్కగట్టింది. ఈ హై రిస్క్ జోన్లో తెలుగుసిటీ విజయవాడ కూడా ఉంది. అది జోన్ 4లో ఉంది. బిల్డింగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూకంప ముప్పుతో నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేగాకుండా దేశంలోని 59 శాతం ప్రాంతాలకు భూకంపాలు వచ్చే ముప్పు ఉందని, ఆయా ప్రాంతాలన్నీ జోన్ 3, 4, 5లోనే ఉన్నాయని చెప్పింది. ఇంతకుముందు వచ్చిన భూకంపాల్లో చనిపోయిన వాళ్లలో 90 శాతం మంది పెద్ద పెద్ద బిల్డింగులు నేలమట్టం కావడం వల్లే చనిపోయారని తేల్చి చెప్పింది.
ఇండియాకు ముప్పు ఎందుకు?
5 కోట్ల ఏళ్ల క్రితం యురేసియాతో భారత ఉపఖండం ప్లేట్లు ఢీకొట్టాయన్నది సైంటిస్టుల మాట. అంతకుముందు ఏటా 18 సెంటీమీటర్ల చొప్పున మహాసముద్రంలో ఇండియా ప్లేటు కదిలేవని, భూమి చరిత్రలో అంత వేగంగా ఏ ఖండమూ కదల్లేదని అంటూ ఉంటారు. ఆ స్పీడుతో యురేసియా ప్లేట్లతో ఢీకొట్టడం వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయని సైంటిస్టులు చెబుతారు. ఆ తర్వాత ఇండియా ప్లేటు నెమ్మదించినా, కదలడం మాత్రం ఆగట్లేదు. యురేసియాను ఢీకొట్టాక ప్లేట్లోని అప్పర్ క్రస్ట్ (భూ పటలం) హిమాలయాల్లోకి చేరిందట. మిగతా అంతా కూడా ఎర్త్ మాంటిల్(పటలం కింది భాగం)లోకి చొచ్చుకెళ్లిపోయిందట. అలా కిందికెళ్లిపోయిన భూ పలకలు ఏటా 2 సెంటీమీటర్ల చొప్పున యురేసియాలోకి చొచ్చుకొస్తున్నాయట. అలా చేరే క్రమంలో ఒక్కోసారి క్రస్ట్ బ్లాక్ అయిపోయి సడన్గా కిందికి జారేదట. అలా జారినప్పుడు విడుదలయ్యే శక్తితో భూ పటలంలో ప్రకంపనలు పుట్టి, ఆ ప్రకంపనలు భూ ఉపరితలానికి చేరుతున్నాయట. దాని వల్లే ఇండియాలో భూకంపాలు వస్తున్నాయట.
ముప్పు తగ్గించాలంటే ఏం చేయాలి?
భూకంప ముప్పు అత్యంత ఎక్కువగా ఉన్న జోన్లలో కేంద్రం స్మార్ట్ సిటీలకు ఎంపిక చేసిన నగరాలూ ఉన్నాయి. ఆయా సిటీలతో పాటు చాలా చోట్ల పట్టణాల్లో జనాభా (అర్బనైజేషన్) పెరిగిపోతోంది. దానికి తగ్గట్టు ఎక్కడికక్కడ నియంత్రణ లేకుండా ఇబ్బడిముబ్బడిగా కట్టడాలు వెలుస్తున్నాయి. కనీస సేఫ్టీ నిబంధనలను పాటించట్లేదు. భూకంపాలను తట్టుకునే విధంగా వాటిని కట్టట్లేదు. కాబట్టి, ప్రభుత్వం, నిర్మాణ సంస్థలు, విద్యావేత్తలు కలిసి భూకంప ముప్పుపై అవగాహన కల్పించాల్సి ఉందని ఎన్డీఎంఏ చెబుతోంది. దానికి తగ్గట్టు నిర్మాణ ప్రమాణాలను తీసుకురావాలని సూచిస్తోంది. ఇప్పటికే కట్టిన బిల్డింగులు భూకంపాలను ఎంత వరకు తట్టుకుంటాయో అంచనా వేయాలని చెబుతోంది. ఒకవేళ ఆ సామర్థ్యం లేకపోతే, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కొత్తగా కట్టే బిల్డింగులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పెట్టిన ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ గైడ్లైన్స్ను విధిగా పాటించేలా ఆదేశాలివ్వాలని చెప్పింది. ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
హై రిస్క్ జోన్లో ఉన్న సిటీలు
సిటీ రాష్ట్రం
శ్రీనగర్ జమ్మూకాశ్మీర్
ఐజ్వాల్ మిజోరాం
పిథోడ్గఢ్ ఉత్తరాఖండ్
భాగల్పూర్ బీహార్
పానిపట్ హర్యానా
షిమ్లా హిమాచల్ప్రదేశ్
సోలన్ హిమాచల్ ప్రదేశ్
రత్నగిరి మహారాష్ట్ర
గ్యాంగ్టక్ సిక్కిం
మొరాదాబాద్ ఉత్తర్ప్రదేశ్
ఉత్తరకాశీ ఉత్తరాఖండ్
నైనిటాల్ ఉత్తరాఖండ్
విజయవాడ ఆంధ్రప్రదేశ్
మునుపటి భూకంపాల వివరాలు
ఏడాది ప్రాంతం తీవ్రత మరణాలు కూలిన బిల్డింగులు
1988 బీహార్-నేపాల్ 6.4 1,004 2,50,000
1991 ఉత్తరకాశీ 6.6 768 42,400
1993 కిలారీ (లాతూర్) 6.3 8,000 30,000
1997 జబల్పూర్ 6.0 38 8,546
1999 చమోలీ 6.8 100 2,595
2001 భుజ్ (గుజరాత్) 6.9 3,805 2,31,000
2005 కాశ్మీర్ 7.6 1,500 4,50,000
2011 సిక్కిం 6.9 110 –––––