చైతన్యానికి, ఆత్మగౌరవానికి మారుపేరు తెలంగాణ

 చైతన్యానికి, ఆత్మగౌరవానికి మారుపేరు తెలంగాణ

శాయంపేట, వెలుగు: రాజకీయాలంటేనే ప్రజల్లో అసహ్యం పుట్టేలా చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్​ అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ మండిపడ్డారు. పీకే (ప్రశాంత్​ కిషోర్​)ని కలిసే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్​ స్థాయి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు. పెరుగుట విరుగట కొరకేనన్నది కేసీఆర్​కు సరిగ్గా సరిపోతుందన్నారు. బీహార్​, యూపీల్లో పీకే రాజకీయాలు నడిచాయేమోగానీ.. తెలంగాణలో నడవవన్నారు. చైతన్యానికి, ఆత్మగౌరవానికి తెలంగాణ మారుపేరని, పీకే కుట్రలు, కుత్రంతలు ఇక్కడ కుదరవని చెప్పారు. ఆదివారం హనుమకొండ జిల్లా శాయంపేటలో నిర్వహించిన మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. జంగారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. జంగారెడ్డి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

చట్టం ఉన్నా పార్టీలు మారుతున్నరు

రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని, ప్రజలు మెచ్చి ఇవ్వాలే తప్ప.. కొనుక్కుంటే వచ్చేవి పదవులు కావని ఈటల అన్నారు. ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరే వాళ్లపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ‘యాంటీ డిఫెక్షన్​ లా’ తీసుకొచ్చినా.. చాలా మంది నాయకులు ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరుతున్నారని విమర్శించారు. అధికార పార్టీ ఆగడాలపై ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.