నా ఫొటో ఫ్లెక్సీల్లో లేకుండా చేస్తారేమో కానీ ప్రజల గుండెల్లో లేకుండా చేయలేరు

నా ఫొటో ఫ్లెక్సీల్లో లేకుండా చేస్తారేమో కానీ ప్రజల గుండెల్లో లేకుండా చేయలేరు
  • తెలంగాణలో దసరా రెండు రోజులైతే.. హుజురాబాద్‎లో మాత్రం ప్రతిరోజూ దసరానే..
  • కేసీఆర్ కుట్రలను నా పాత సహచరుడు అమలు చేస్తుండు

కరీంనగర్: హుజూరాబాద్ లో నా ఫ్లెక్సీలు లేకుండా చేయగలరేమో కానీ, ప్రజల గుండెల్లో నా ఫోటో లేకుండా చేయలేరని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట మార్కెట్ కమిటీ  మాజీ వైస్ ఛైర్మన్ సురేందర్ రాజు, ఇతర నేతలు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జమ్మికుంట క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. 

‘వందల కోట్ల ఖర్చు చేసి ఈటల రాజేందర్‎ను ఓడించగలమనే భ్రమల్లో టీఆర్ఎస్ వాళ్లు ఉన్నారు. నన్ను బతికుండగానే బొంద పెట్టవచ్చని కేసీఆర్ కలలు గంటున్నాడు. కేసీఆర్ కుట్రలను అమలు చేస్తుంది నా పాత సహచరుడు హరీశ్ రావు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వందల సంఖ్యలో నాయకులు ఇక్కడ తిరుగుతున్నారు. ఉద్యమ బిడ్డగా ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. హుజురాబాద్‎లో ఒక్క ఫ్లెక్సీ పెట్టుకోకుండా చేశారు. పెట్టిన జెండాలు తీసేశారు. ఫ్లెక్సీల్లో నా ఫొటో ఉండకపోవచ్చు కానీ, నా ఫొటో ప్రజల గుండెల్లో ఉంది.  ఇవాళ మా పార్టీలో చేరుతున్న నాయకుల ఇంటికి రాత్రి పూట వచ్చి టీఆర్ఎస్ నాయకులు బెదిరించారట. వీళ్లంతా వాళ్లను తప్పించుకుని వచ్చి ఈ రోజు బీజేపీలో చేరుతున్నారు. నచ్చిన పార్టీలో చేరే స్వేచ్ఛ కూడా లేదా? టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. మీ పార్టీలోకి వచ్చిన వాళ్లంతా తిరిగి నా వెంటే వస్తారు. మీ మందు సీసాలు అయిపోయిన తర్వాత నా దగ్గరకే వస్తారు. మీతో చేరిన వాళ్లంతా నాకు టచ్‎లో ఉన్నారు. ఎంపీటీసీలు, సర్పంచులంతా నాతో మాట్లాడుతున్నారు. కేవలం వాళ్లకు రావాల్సిన బిల్లుల కోసం, అప్పులు తీర్చుకోవడం కోసమే పోతున్నామని నాకు చెబుతున్నారు. ఇప్పుడు బిల్లుల వచ్చాయని, రోడ్లు వేశారని.. ఇక నీవెంట నడుస్తామంటున్నారు. కానీ, నేను అందరినీ తిరిగి నా దగ్గరకు రానీయడం లేదు. ఎవరైతే ధర్మంగా, న్యాయంగా ఉంటారో.. అటువంటి వాళ్లనే మళ్లీ నా దగ్గరకు తీసుకుంటా. తెలంగాణలో దసరా రెండు రోజులు మాత్రమే ఉంటే.. హుజురాబాద్‎లో మాత్రం దసరా  రోజూ అవుతుంది. మనకు మద్యం తాగించి ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు. మన ప్రాణాలు ఫణంగా పెట్టైనా ఓట్లు పొందాలని చూస్తున్నారు. గ్రామాలకు గ్రామాలే బార్లుగా మారుతుంటే.. మనం అడ్డుకట్ట వేయాలి. డబ్బులిస్తే తీసుకోండి... కానీ మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకోకండి. మనకు పథకాల రూపంలో ఇచ్చిన డబ్బులన్నీ మన డబ్బులే. దళితబంధు కేవలం మెసేజ్ రూపంలోనే వచ్చింది. కానీ డబ్బులు మాత్రం చేతికి రాలేదు. ఈ నెల 30 లోపు దళిత కుటుంబాలందరికీ కలెక్టర్, బ్యాంకుల పెత్తనం లేకుండా డబ్బులు ఇవ్వాలి. బీసీ బంధు కూడా పెట్టాలి. అన్ని కులాల్లోని పేదలకు 10 లక్షలిచ్చి ఆదుకోవాలి. రైతు అయితే చాలు.. రైతుబంధు ఎలా ఇస్తున్నావో.. పేదరికంలో ఉన్నోళ్లందరికీ కులానికి అతీతంగా పది లక్షలు ఇవ్వాలి. వ్యాపారులు ఎవరూ మాతో రావడం లేదు. ఎందుకు రావడం లేదని అడిగితే.. మీ వ్యాపారాలు నడవాలంటే మా పార్టీలోనే ఉండాలని టీఆర్ఎస్ వాళ్లు బెదిరించారని చెబుతున్నారు. నాదగ్గరకు రాకుండా వాళ్లను ఆపవచ్చేమో కానీ.. ఓట్లు వేయకుండా ఆపగలరా? మన గుండెళ్లో ఉన్న ప్రేమకు ప్రతీక ఓటు. కేసీఆర్ అహంకారానికి, డబ్బు సంచులకు.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. యోధానుయోధులు కౌరవుల పక్షమే ఉన్నా... ధర్మం వైపు నిలబడిన పాండువులే గెలిచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి.. ధర్మాన్ని గెలిపించండి. ఇప్పటికే 90 శాతం ప్రజలు ఎవరికి ఓటువేయాలో నిర్ణయించుకున్నారు. వాళ్ల నిర్ణయాన్ని ఎన్ని డబ్బులిచ్చినా మార్చలేరు. పంచీ, పంచీ.. ఇదేం హుజురాబాద్‎రా అంటున్నారట. అందుకే హుజురాబాద్ చైతన్యానికి ప్రతీక అంటున్నా’ అని ఈటల అన్నారు.