కారు గుర్తుతో పోలి ఉన్న గుర్తులు తొలగించిన ఈసీ

కారు గుర్తుతో పోలి ఉన్న గుర్తులు తొలగించిన ఈసీ

బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారుతో పోలి ఉన్న ఆటో రిక్షా, ట్రక్, టోపీ, ఇస్త్రీ పెట్టె గుర్తులను ఎన్నికల కమిషన్ తొలగించింది. ఈ గుర్తులు ఇకనుంచి ఎలాంటి ఎన్నికల్లో ఉపయోగించమని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి మేరకు ఎలక్షన్ కమిషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తులను కేటాయించింది. దీంతో ఓటర్లు గందరగోళానికి గురై.. కారు గుర్తుకు బదులు వేరే గుర్తులకు ఓటు వేసినట్లు గతంలో పెద్ద చర్చ జరిగింది.

కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ  తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను క‌లిసింది. ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు 8 ఉన్నాయ‌ని, వాటిని ఫ్రీ సింబ‌ల్స్ జాబితా నుంచి తొల‌గించాల‌ని కోరింది. అప్పట్లో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వికాస్ రాజ్‌కు ఓ విన‌తి ప‌త్రాన్ని కూడా స‌మ‌ర్పించింది.

మరోవైపు దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో రెండు, తెలంగాణలో నాలుగు పార్టీలకు ఈ గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన వాటిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ (వైసీపీ), తెలుగుదేశం పార్టీలున్నాయి. తెలంగాణలో ఎంఐఎం, బీఆర్‌ఎస్‌తో పాటు తెలుగుదేశం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ (వైఎస్సార్టీపీ ) పార్టీలు రాష్ట్ర పార్టీ హోదా పొందినట్లు వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు ప్రస్తుతం కేటాయించిన గుర్తులను ఆ రాష్ట్రాల్లో రిజర్వు చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నాలుగు పార్టీల చిరునామాలు హైదరాబాద్‌ కేంద్రంగానే ఉన్నాయి. వీటికి అతీతంగా కేంద్ర ఎన్నికల సంఘం 193 ఫ్రీసింబల్స్‌ను విడుదల చేసింది. ఆటోరిక్షా, హ్యాట్‌, ఇస్ట్రీపెట్టె, ట్రక్కు గుర్తులను మాత్రం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఇవ్వడం లేదని ఈసీ పేర్కొంది.  ఇవి కారు గుర్తును పోలి ఉండటంతో వాటిని తెలుగు రాష్ట్రాల జాబితా నుంచి మినహాయించింది.

జాతీయ పార్టీల జాబితాలో ఆప్‌, బీఎస్పీ, బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.