
న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ ఆమెను ప్రశ్నించేందుకు సిద్ధమైంది.
వాస్తవానికి సోనియా గాంధీ జూన్ 8న ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. జూన్ 2న కొవిడ్ సోకడంతో సాధ్యం కాలేదు. దీంతో దర్యాప్తు సంస్థ జూన్ 23న హాజరుకావాలని మరోసారి సమన్లు పంపింది. అయితే అనారోగ్యం కారణంగా ఆమె హాస్పిటల్ లో చేరడంతో విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కోరారు. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జులై 21న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. ఇదే కేసుకు సంబంధించి రాహుల్ గాంధీని ఈడీ ఇది వరకే ప్రశ్నించింది. ఐదు రోజుల పాటు ఆయన విచారణ కొనసాగింది.