జూలై 1 నుంచి అన్ని కేటగిరీల విద్యాసంస్ధలు ప్రారంభం

జూలై 1 నుంచి అన్ని కేటగిరీల విద్యాసంస్ధలు ప్రారంభం

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీలో..దేశవ్యాప్తంగానే కాకుండా, పక్కరాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి అధికారులందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్దారించింది.  ఈ మేరకు..జూన్ 19 వరకు అమల్లో వున్న లాక్ డౌన్ ను రేపటినుంచి (జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. 

లాక్ డౌన్ ఎత్తివేయడంతో  అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థత తో  జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. అంతేకాదు.. రేపటి నుంచి  సినిమా హాళ్లు, పబ్‌లు, షాపింగ్ మాల్స్‌, వ్యాపార, వాణిజ్య సముదాయాలు తెరచుకోనున్నాయి. యథావిధిగా మెట్రో, బస్సు సర్వీస్‌లు నడవనున్నాయి.విద్యా సంస్థలు పున: ప్రారంభం అవుతున్న క్రమంలో.. విద్యార్ధుల తప్పనిసరి హాజరు, ఆన్ లైన్ క్లాసుల కొనసాగింపు, తదితర నిబంధనలు, విధి విధానాలకు సంబంధించిన ఆదేశాలను.. త్వరలో విడుదల చేయాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది.

ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో.. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, సానిటైజర్ ఉపయోగించడం.. తదితర  కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు.. ప్రజలు  సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర ప్రజలను కేబినెట్ కోరింది.