- 10 వేల నకిలీ ఓటర్ ఐడీ కార్డుల తయారీ
- యూపీ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) వెబ్సైట్ను ఓ దుండగుడు హ్యాక్ చేశాడు. అంతేకాదు.. ఏకంగా 10 వేల నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులను తయారు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఉత్తర్ప్రదేశ్లోని శహరన్పూర్కు చెందిన విపుల్ సైనీ అనే 24 ఏండ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన అర్మాన్ మాలిక్ అనే వ్యక్తి తరఫున ఈ పనిచేసినట్టు గుర్తించారు. ఒక్కో ఐడీ కార్డుకు రూ.100 నుంచి రూ.200 దాకా తీసుకునేవాడని తేల్చారు. సైనీ ఖాతాలో రూ.60 లక్షల దాకా ఉన్నట్టు చెప్పారు. వెంటనే ఆ ఖాతాను ఫ్రీజ్ చేశారు. సైనీ ఇంట్లోని రెండు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రస్తుతం వెబ్సైట్ సురక్షితంగా ఉందని ఈసీ అధికారి ఒకరు చెప్పారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటుకు దూరంగా ఉండకూడదన్న ఉద్దేశంతో అసిస్టెంట్ ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్స్ (ఏరో)ను ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే, ఓటర్ ఐడీ కార్డుల ప్రింటింగ్ కోసం ఏరో ఆఫీసుకు చెందిన ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ తన ఐడీ, పాస్వర్డ్ వివరాలను ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్కు ఇచ్చాడని చెప్పారు. ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్తో పాటు సర్వీస్ ప్రొవైడర్ను అరెస్టు చేసినట్లు తెలిపారు.