
బెంగళూరులో ఇంజినీరింగ్ సీట్ల బ్లాక్ స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలపై దాడులు నిర్వహించింది. బెంగళూరు నగర వ్యాప్తంగా బుధవారం (జూన్ 25, 2025) ఈ దాడులు జరిగాయి. ఇంజినీరింగ్ సీట్ల అక్రమ బ్లాకింగ్, మనీ లాండరింగ్ ఆరోపణలపై ED దాడులు చేసింది.బెంగళూరులోని 18 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. వీటిలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల ఆఫీసులు, ట్రస్టీల నివాసాలు, విద్యా కన్సల్టెంట్లు, సీటు బ్లాకింగ్ ఏజెంట్ల కార్యాలయాలు, నివాసాలు ఉన్నాయి.
బెంగళూరులో ప్రముఖ BMS కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఆకాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, న్యూ హారిజన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ వంటి కళాశాలలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
2024-25 విద్యా సంవత్సరంలో 2వేల 625ఇంజినీరింగ్ సీట్లను అక్రమంగా బ్లాక్ చేసి వాటిని అధిక ధరకు అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది అర్హులైన విద్యార్థులకు సీట్లు దక్కకుండా చేసి, ప్రైవేట్ కళాశాలలకు అక్రమంగా డబ్బు సంపాదించడానికి వీలు కల్పించింది.
►ALSO READ | 200 కోట్ల మందికి అందని మంచి నీరు.. ఆ దేశాల్లో ఎక్కువగా సమస్య..
ఈ స్కాంపై గతంలో మల్లేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేశారు. వారిలో కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ (KEA)కి చెందిన ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా ఉన్నాడు. అప్పటి దర్యాప్తులో కొన్ని కళాశాలలకు నోటీసులు కూడా ఇచ్చారు. మనీ లాండరింగ్ ఆరోపణలు వెలుగులోకి రావడంతో ED ఈ కేసును చేపట్టింది.
ED ప్రధానంగా కోట్ల రూపాయల లావాదేవీల వెనుక ఉన్న మనీ ట్రైల్ను పరిశీలిస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈ దర్యాప్తు జరుగుతోంది. ఈ దాడులు దర్యాప్తు ఇంజినీరింగ్ ప్రవేశాల్లో పారదర్శకతను పెంచడానికి అక్రమాలను అరికట్టడానికి సహాయపడతాయని ఈడీ భావిస్తోంది.