ముంబై:యూరోపియన్ మార్కెట్లు బలహీనంగా నడవడం, భారీ అమ్మకాల కారణంగా ఈక్విటీ బెంచ్మార్క్లు సెన్సెక్స్ , నిఫ్టీ మంగళవారం ఒకశాతం శాతం వరకు నష్టపోయాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 632 పాయింట్లు తగ్గి 60,115.48 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 808.93 పాయింట్లు తగ్గి 59,938.38 వద్దకు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 187.05 పాయింట్లు తగ్గి 17,914.15 వద్ద ముగిసింది. బీఎస్ఈ-లిస్టెడ్ స్టాక్ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 280 లక్షల కోట్లకు తగ్గడంతో పెట్టుబడిదారులకు రూ. 3 లక్షల కోట్ల నష్టం జరిగింది. ఎఫ్ఐఐల విక్రయాల ఒత్తిడి కారణంగా మార్కెట్ సోమవారం నాటి లాభాలను కోల్పోయింది. ఫియర్ గేజ్ ఇండెక్స్ ఇండియా వీఐఎక్స్ దాదాపు 6శాతం పెరగడంతో ఆటో మినహా అన్ని రంగాల్లో విక్రయాలు కనిపించాయి. ఈ వారం క్యూ3 ఎర్నింగ్స్ సీజన్ ప్రారంభం కావడంతో బ్యాంకులు, ఫైనాన్షియల్లు ఐటీ స్టాక్లు అత్యధికంగా నష్టపోయాయి. సెన్సెక్స్ ప్యాక్ నుంచి, భారతీ ఎయిర్టెల్, ఎస్బిఐ రెండుశాతానికిపైగా పడిపోయాయి. అయితే, క్యూ3లో గ్లోబల్ హోల్సేల్స్ బాగుండటంతో టాటా మోటార్స్ షేర్ 6శాతం లాభాలతో ముగిసింది. ట్రేడింగ్ సెంటిమెంట్ చాలా బలహీనంగా ఉందని, గ్లోబల్ మార్కెట్లలో పరిస్థితులు బాగా లేకపోవడంతో అమ్మకాలు ఎక్కువ అయ్యాయని కోటక్ సెక్యూరిటీస్కు చెందిన శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. పెట్టుబడిదారులు ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కామెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. గురువారం రాబోయే యూఎస్సీపీఐ రిపోర్ట్పై ఆసక్తి నెలకొంది. ‘‘ఫెడ్ హాకిష్ వైఖరి నుంచి పావెల్ వైదొలిగే అవకాశం లేదు. అయితే బుధవారం సీపీఐ డేటా ఇన్ఫ్లేషన్ తగ్గితే పరిస్థితి మారవచ్చు. మార్కెట్లు పెరగవచ్చు. ఈ ఏడాది ముగింపు నాటికి రేట్లు తగ్గవచ్చు. ధరలు ఇంకా అధిక స్థాయిలోనే కొనసాగితే మాత్రం మార్కెట్లకు నష్టాలు ఉండవచ్చు”అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెందిన డాక్టర్ వీకే విజయకుమార్ అన్నారు.
నష్టాలకు ఐదు కారణాలు:
1.ఎఫ్ఐఐ అవుట్ఫ్లో
ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు)ఈ నెలలో ఇప్పటి వరకు బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఇండియా స్టాక్లను విక్రయించారు. వీళ్లు మంగళవారం కూడా భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఎఫ్ఐఐలు సోమవారం రూ.203 కోట్ల విలువైన మన కంపెనీల ఈక్విటీలను విక్రయించారు. జనవరిలో ఇప్పటివరకు మొత్తం ఫారిన్ అవుట్ఫ్లో రూ. 8,548 కోట్ల వరకు ఉంది. చైనా మార్కెట్లను మళ్లీ తెరవడంతో, ఎఫ్ఐఐల డబ్బులో కొంత భాగం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు వెళ్తుందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
2. ఫెడ్ భయం
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు విధానాలు పెట్టుబడిదారులకు టెన్షన్ పెంచుతున్నాయి. వడ్డీరేట్లను మరోసారి పెంచే అవకాశాలు ఉన్నాయని బ్యాంకు వర్గాలు సంకేతాలను పంపించడమే ఇందుకు కారణం. శాన్ ఫ్రాన్సిస్కో ఫెడ్ ప్రెసిడెంట్ మేరీ డాలీ మాట్లాడుతూ ఇన్ఫ్లేషన్ను తగ్గించడానికి సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 5శాతం కంటే ఎక్కువ పెంచుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. అట్లాంటా ఫెడ్ ప్రెసిడెంట్ రాఫెల్ బోస్టిక్ మాట్లాడుతూ, ఫెడ్ రెండవ క్వార్టర్ప్రారంభంలో 5శాతం కంటే ఎక్కువ రేట్లను పెంచాలని, ఆ తర్వాత చాలా కాలం పాటు నిలిపివేయాలని అన్నారు.
3. ప్రపంచ మార్కెట్లు
టెక్ బూస్ట్తో జపాన్కు చెందిన నిక్కీ 2 వారాల గరిష్ట స్థాయికి చేరుకోగా, ఆసియా మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి. ఇతర ప్రపంచ మార్కెట్లలో, పాన్- యూరోపియన్ ఎస్టీ ‘ఓఎక్స్ఎక్స్ 600’ 0.7శాతం తగ్గింది. యూకే ‘ఎఫ్టీఎస్ఈ 100’ 0.3శాతం పడిపోయింది.
4. క్యూ3 రిజల్ట్స్
టీసీఎస్సోమవారం మూడో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఇవి అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో షేరు రెండు శాతానికిపైగా నష్టపోయింది. హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో.. ఇవన్నీ క్యూ3 ఆదాయాలను ఈవారమే ప్రకటించనున్నాయి. వారాంతంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్ని విడుదల చేస్తోంది.
5. అందరి దృష్టి పావెల్పైనే
పెట్టుబడిదారులు ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ కామెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. గురువారం రాబోయే యూఎస్సీపీఐ రిపోర్ట్పై ఆసక్తి నెలకొంది. ‘‘ఫెడ్ హాకిష్ వైఖరిని పావెల్ మార్చుకునే అవకాశం ఉండకపోవచ్చు. అయితే సీపీఐ డేటా ఇన్ఫ్లేషన్ తగ్గితే మార్కెట్లు పెరగవచ్చు. ఈ ఏడాది ముగింపు నాటికి రేట్లు తగ్గవచ్చు”అని విజయకుమార్ అన్నారు.