కశ్మీర్లో ఈయూ బృందం: పాక్ ఉగ్రవాదంపై ఆర్మీ ప్రజెంటేషన్

కశ్మీర్లో ఈయూ బృందం: పాక్ ఉగ్రవాదంపై ఆర్మీ ప్రజెంటేషన్

కశ్మీర్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటు ఎంపీల బృందం ఇవాళ కశ్మీర్ పర్యటనకు వెళ్లింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ఈయూ టీమ్ శ్రీనగర్ చేరుకుంది. ఇక్కడ ముందుగా వారు ఆర్మీ క్యాంపులో సమావేశం అయ్యారు.

కశ్మీర్లో పాక్ టెర్రర్

15 కాప్స్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో ఈ సమావేశం జరిగింది. పాకిస్థాన్ ఉగ్రవాదులను ప్రోత్సాహించి భారత్ పైకి ఎగదోస్తున్న తీరును ఈయూ బృందానికి మన ఆర్మీ వివరించింది. నిరంతరం కశ్మీర్ అల్లకల్లోలంగా ఉండడానికి పాకిస్థానే కారణమని ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల చొరబాట్లకు అండగా ఉంటూ లోయలో నిత్యం రాచపుండులా అగ్గిరాజేస్తోందని చెప్పారు. ముష్కరుల వెనుక పాక్ ఆర్మీ ఉండి కశ్మీర్ తోపాటు, ఇండియాలో దాడులు చేయిస్తోందన్నారు. ఈ భేటీ తర్వాత కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో వారు పర్యటించారు. స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు.

దాల్ లేక్ లో విహారం

ఈయూ పార్లమెంటు ప్రతినిధుల బృందం కశ్మీర్లో ఆర్మీ అధికాులతో మాట్లాడిన తర్వాత పలు ప్రాంతాల్లో పర్యటించారు. కొన్ని పర్యాటక ప్రదేశాల్లోనూ విహరించారు. శ్రీనగర్ లోని దాల్ లేక్ లో బోటు షికారు చేశారు.

నిన్న భారత్ కు వచ్చిన ఈయూ టీమ్ ప్రధాని మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ తో సంబంధాల బలోపేతంతో పాటు కశ్మీర్ లో పరిస్థితులపైనా చర్చించారు.