బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫేస్ బుక్ అకౌంట్ బ్యాన్

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫేస్ బుక్ అకౌంట్ బ్యాన్

న్యూఢిల్లీ: గోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత టి.రాజా సింగ్ అకౌంట్ ను ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ బ్యాన్ చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల విద్వేష ప్రసంగాల విషయంలో ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదని ఫేస్ బుక్ ను ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించిన విషయం తెలిసిందే. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తాజాగా రాజా సింగ్ అకౌంట్ ను ఎఫ్ బీ నిషేధించిందని సమాచారం. కంటెంట్ ప్రమోషన్ లోని విద్వేషం, హింస అనే పాలసీలను అతిక్రమించినందుకు ఆయన అకౌంట్ ను తొలగించామని ఫేస్ బుక్ అధికార ప్రతినిధి తెలిపారు.

హింసను ప్రేరేపించే విద్వేషపూరిత విషయాలను తమ ప్లాట్ ఫామ్ లో ప్రమోట్ చేసినందుకు గాను రాజా సింగ్ అకౌంట్ ను తమ కంపెనీ పాలసీ ప్రకారం బ్యాన్ చేశామని సదరు అధికారి చెప్పారు. ఇదిలా ఉంచితే తనకు ఫేస్ బుక్ పేజీ లేదని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోలో రాజా సింగ్ సుస్పష్టం చేయడం గమనార్హం. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ ప్యానెల్ బుధవారం నిర్వహించిన మీటింగ్ లో ఫేస్ బుక్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పక్షపాత వైఖరిని ఎందుకు అవలంభిస్తున్నారంటూ ఎఫ్ బీ అధికారులను థరూర్ ప్రశ్నించారు.