డెడ్​బాడీతో ఆందోళన.. ధర్మారంలో ఉద్రిక్తత

డెడ్​బాడీతో ఆందోళన..  ధర్మారంలో ఉద్రిక్తత
  • పోలీసులు, బంధువుల మధ్య తోపులాట.. ఒకరికి గాయాలు

పరకాల, వెలుగు: హనుమకొండ జిల్లా నడికూడ మండలం ధర్మారం గ్రామంలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నక్క లక్ష్మి(35) ఐదురోజుల కింద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా సోమవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి భర్త ఎర్రయ్య పట్టించుకోకపోవడంతోనే మరణించిందని ఆరోపిస్తూ మృతురాలి తరఫు బంధువులు మంగళవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ఎర్రయ్య ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి ధర్నా చేపట్టారు. ఎర్రయ్యతోపాటు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.

దీంతో మృతురాలి బంధువులు పరకాల– -ఎర్రగట్టు గుట్ట హైవేపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా, మృతురాలి బంధువులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు, బాధిత మహిళల మధ్య తోపులాట జరిగింది. ఓ వృద్ధురాలి చేతికి స్వల్ప గాయాలయ్యాయి. చివరికి పోలీసుల హామీతో మృతురాలి బంధువులు ఆందోళన విరమించారు. పోలీసులు న్యాయం చేయకపోతే బుధవారం ఆందోళన కొనసాగిస్తామని పలువురు హెచ్చరించారు.