
- ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలి: ఏసీబీ కోర్టు
- సిట్ మెమో రిజెక్ట్.. నేడు ముగ్గురు నిందితుల విడుదల
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు నాంపల్లి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, లాయర్ శ్రీనివాస్ను నిందితులుగా చేర్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం సిట్కి లేదని ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి జి.రాజగోపాల్ తేల్చి చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్(పీసీ యాక్ట్) గ్రౌండ్లో సిట్ దాఖలు చేసిన మెమోను తిరస్కరించారు. పీసీ యాక్ట్ కేసుల్లో ఏసీబీకి మాత్రమే దర్యాప్తు అధికారం ఉందని, లా అండ్ ఆర్డర్ పోలీసులకుగానీ, సిట్కుగానీ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలంటూ గత నెల 22న సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేశారు. మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు ఆ మెమోను రిజెక్ట్ చేసింది.
మొయినాబాద్ అజీజ్నగర్లోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారంటూ ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజి, హైదరాబాద్కు చెందిన నందకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు వీరు కుట్ర పన్నారని, ఈ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సీవీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ టీమ్ కేసు దర్యాప్తు చేస్తున్నది. నిందితుల కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్ ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నది. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, లాయర్ శ్రీనివాస్తో నిందితులు కాంటాక్ట్లో ఉన్నట్లు ఆధారాలు సేకరించింది. వీరిని నిందితుల జాబితాలోకి చేర్చేందుకు యత్నించింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గంగాధర్ పేరుతో గత నెల 22న నాంపల్లి ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేశారు. ఏ4గా బీఎల్ సంతోష్, ఏ5గా తుషార్, ఏ6గా జగ్గుస్వామి, ఏ7గా శ్రీనివాస్ను ఎఫ్ఐఆర్లో చేర్చాలని కోరారు. ఈ మెమోపై ఏసీబీ కోర్జు జడ్జి జి.రాజగోపాల్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా పీసీ కేసులను లా అండ్ ఆర్డర్ పోలీసులు దర్యాప్తు చేయడంపై వాదనలు విన్నారు. పీసీ యాక్ట్ ప్రొసీడింగ్స్కు విరుద్ధంగా కేసు దర్యాప్తు సాగుతున్నదని నిందితుల తరుపు లాయర్లు వాదించారు. మెమోలో పేర్కొన్న అభియోగాలను పరిశీలించిన కోర్టు దానిని రిజెక్ట్ చేస్తూ ఆదేశాలిచ్చారు.
ఇయ్యాల విడుదల కానున్న నిందితులు
ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలు బుధవారం జైలు నుంచి విడుదల కానున్నారు. వీరికి హైకోర్ట్ గత వారమే బెయిల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో నిందితుల తరుపు లాయర్లు ఏసీబీ కోర్టులో ష్యూరిటీలు ఇచ్చారు. వీటిని పరిశీలించిన కోర్టు సింహయాజికి పూచీకత్తులను ఆమోదించింది. రిలీజ్ ఆర్డర్ను చంచల్గూడ జైలుకు పంపింది. రామచంద్రభారతి, నందకుమార్ ష్యూరిటీలను కోర్టు బుధవారం పరిశీలించనుంది. ష్యూరిటీలను ఆమోదించిన తర్వాత బెయిల్ ఆర్డర్స్ జైలుకు చేరనున్నాయి. ఆ తర్వాత ఈ ఇద్దరు రిలీజ్ అవుతారు.