V6 News

Paytm: పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్.. పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ రద్దు

Paytm: పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్.. పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ రద్దు

పేటీఎం కు భారీ షాకిచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank Ltd) లైసెన్స్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు కార్యకలాపాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని.. బ్యాంకు కార్యకలాలన్నీ ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, డిపాజిట్లను తీసుకోవడం మొదలైన కార్యకలాపాలను ఇప్పటికే రద్దు చేసిన ఆర్బీఐ.. 2026 ఏప్రిల్ 24వ తేదీన పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడం ఫైనాన్స్ సెక్టార్లో సంచలనంగా మారింది. 

పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో పలుమార్లు పేటీఎం బ్యాంకుకు హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ తీరు మారకపోవటంతో లైసెన్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2022 లోనే పేటీఎంపై ఆర్బీఐ చర్యలకు పూనుకుంది. ఆ తర్వాత 2024లో నిబంధనలు మరింత కఠినతరం చేసింది. నిబంధనల ఉల్లంఘనలు, బ్యాంకు కార్యకలాపాలలో అవకతవకలు, కస్టమర్ల ఆందోళనల నడుమ ఈ నిర్ణయం తీసుకుంది. 

►ALSO READ | నిరుద్యోగులకు పోస్టల్ శాఖ బిజినెస్ ఐడియా : ఔత్సాహిక వ్యాపారులకు ఆహ్వానం

లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వెనుక చాలా కారణాలున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. రుణదాతలు, డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు యాజమాన్యం తీరు ప్రజలకు, డిపాజిటర్లకు, కస్టమర్ల ప్రయోజానాలకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంది. 

బ్యాంకు కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతించే విషయంలో మరో ఆలోచన లేనట్లు ఆర్బీఐ చెప్పింది. అలాంటి అనుమతి ఇచ్చినా ఎలాంటి ప్రయోజనాలను భవిష్యత్తులో ఆశించలేమని పేర్కొంది. కంపెనీకి నిర్దేశించిన షరతులను పాటించడంలో పేమెంట్ బ్యాంక్ విఫలమైందని.. దాని పర్యావసానంగానే బ్యాంకు లైసెన్సు రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.