ఆగని ఆందోళనలు.. రోడ్డెక్కిన రైతన్నలు

ఆగని ఆందోళనలు.. రోడ్డెక్కిన రైతన్నలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ధాన్యం కొనుగోలు చేయడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. చందుర్తి మండలం మూడపల్లి వద్ద, వేములవాడ  కోరుట్ల ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు రైతులకు నచ్చే ప్రయత్నం చేసిన కలెక్టర్ రావాలంటూ రోడ్డుపై బైఠాయించారు.ఇప్పటికే ప్రకృతి శాపం వలన నష్టపోయామని, మళ్ళీ ప్రభుత్వం రైతులను ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. 

మరోవైపు బోయిన్పల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు వెంటనే చేయాలని రైతులు బోయిన్పల్లి చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు.అధికారులు లారీల కొరత సాకు పేరుతో వారం రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిపివేశారని, అలాగే క్వింటాలకు తరుగు పేరిట ఐదు కిలోలు కట్ చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయలని రైతులు డిమాండ్ చేశారు.

మెదక్ జిల్లా: రామాయంపేట మండల కేంద్రంలో దౌల్తాబాద్ రామాయంపేట్ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం తూకం వేయడం లేదని, హమాలీల కొరత తీవ్రంగా ఉందని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి లారీలు ఏర్పాటు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.

జగిత్యాల జిల్లా: వెల్గటూర్ బీఆర్ఎస్ నేత, పీఎసీఎస్ చైర్మన్ గోలి రత్నాకర్ ఇంటిముందు రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు నిలిపివేశారని చైర్మన్ నిలదీసి ఆగ్రహం వ్యక్తం చేశారు మొక్కట్రావ్ పేట్ గ్రామ రైతులు. సుమారు రెండు గంటల పాటు చైర్మన్ తో రైతులు వాగ్వాదం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రం లోనే ధాన్యం బస్తాలు ఉండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని చైర్మన్ తో గొడవకు దిగారు. వెంటనే ఆయన సివిల్ సప్లై అధికారులకు ఫోన్ చేసి..మీ నిర్వాకం వల్ల మేము మాటలు పడాల్సి వస్తుందని  ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, చైర్మన్ రత్నాకర్ రావు మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరుడని తెలుస్తోంది.