- నీళ్లివ్వండి ప్లీజ్!ఎల్నినో, కరువు నేపథ్యంలో ఎగువ రాష్ట్రాలకు సర్కారు విజ్ఞప్తి
- ఈ వారంలో మహారాష్ట్ర అధికారులతో మన అధికారులు భేటీ అయ్యే చాన్స్
- కొయినా డ్యామ్ నుంచి నీటిని సహేతుకంగా ఇచ్చేలా చర్చ
- కర్నాటక అధికారులకూ విన్నవించే అవకాశం.. నారాయణపూర్ జలాలు అడిగేందుకు అవకాశం
- ఈ నెల 25న తెలంగాణ, ఏపీ, కర్నాటక సీఎంల భేటీ!
హైదరాబాద్, వెలుగు: ఎల్నినో ముప్పు.. కరువు సంక్షోభం తరుముకొస్తున్న వేళ.. రాష్ట్రానికి అందాల్సిన నీళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. నైరుతి రుతుపవనాలు వీక్గా ఉండడం, ఎగువన వర్షాలు పడకపోతుండడంతో.. మన ప్రాజెక్టులకు వచ్చే వరదలు కూడా తగ్గే ప్రమాదం పొంచి ఉంది. ఆ ముప్పును దృష్టిలో ఉంచుకుని ఎగువ రాష్ట్రాల నుంచి నీటిని తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలను కలిసి విజ్ఞప్తి చేయనుంది. ఈ వారం రోజుల్లోనే అధికారులు ఇటు మహారాష్ట్ర, అటు కర్నాటక అధికారులను కలిసి విజ్ఞప్తి చేసే అవకాశాలున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. లేఖలు కూడా రాయబోతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు తొలుత మహారాష్ట్రకు వెళ్లాలని నిర్ణయించారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవన్న ఆందోళనలతో.. తమకూ ఎగువ నుంచి వచ్చే వరదల్లో కొంత మేర వాటా ఇవ్వాలని కోరనున్నారు.
వరదలు రాకుంటే కష్టమే..
ప్రస్తుతం ఎగువన మహారాష్ట్ర, కర్నాటకతో పాటు దిగువన ఉన్న మన రాష్ట్రంలోని ప్రాజెక్టులు కూడా డెడ్స్టోరేజ్కు చేరువలో ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇప్పటిదాకా ఎగువన కూడా వరదలు మొదలు కాలేదు. గత ఏడాదిలాగా ఇప్పుడు వరదలు వచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో అత్యంత లోటు వర్షపాతం ఉన్నది. ఈ క్రమంలోనే అక్కడి నుంచి వరదలు మొదలైనా.. దిగువ వరకూ నీళ్లు రాకుంటే తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వచ్చిన వరదల్లో జలాలను సహేతుకంగా వాడుకునేలా చొరవ చూపాలని మహారాష్ట్ర, కర్నాటకలను కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఎగువన ప్రాజెక్టులు నిండి, మన ప్రాజెక్టులు నిండకుంటే.. ఆయా ప్రాజెక్టుల నుంచి ‘ప్రపోర్షనల్’గా నీటిని విడుదల చేయాలని ఎగువ రాష్ట్రాలకు విజ్ఞప్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని కోయినా డ్యామ్ నుంచి నీటిని తీసుకునేందుకు యోచిస్తున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 105.72 టీఎంసీలుకాగా.. డెడ్ స్టోరేజ్ కేవలం 5 టీఎంసీలే. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులోనూ 10 టీఎంసీలకు మించి నీళ్లు లేవు. వరదలు మొదలయ్యాక ఆ ప్రాజెక్టు నిండేందుకు ఎక్కువ సమయమేమీ పట్టదని అధికారులు యోచిస్తున్నారు. కాబట్టి ఆ ప్రాజెక్టు నిండితే.. దిగువన మనకు కూడా కొన్ని నీళ్లు ఇచ్చేలా మహారాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరపనున్నారు. అసలే ఈ ఏడాది కరువు ప్రభావం మహారాష్ట్రపైనే తీవ్రంగా ఉంటుందన్న ఆందోళనల నేపథ్యంలో.. తెలంగాణ ప్రతిపాదనలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
కర్నాటకనూ కోరే చాన్స్
నీళ్ల విషయంలో ఇటు కర్నాటక ప్రభుత్వాన్నీ రిక్వెస్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎగువన కర్నాటకలో కీలకమైన ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లున్నాయి. వాటి నుంచి నీళ్లొస్తేనే మన ప్రాజెక్టులు నిండుతాయి. ఈ క్రమంలోనే ఆ రెండు ప్రాజెక్టుల నుంచి నీళ్లను కోరాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రాజెక్టుల్లోని నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. నారాయణపూర్ నుంచీ నీటిని ఇవ్వాలని విజ్ఞప్తి చేసే అవకాశాలున్నాయి. కాగా, ఇప్పుడు ఆ ప్రాజెక్టులోనూ వాటర్ తక్కువగానే ఉంది. 24 టీఎంసీల స్టోరేజ్ మాత్రమే ఉన్నది. ఈ ఏడాది కృష్ణాలో వరద తక్కువగానే ఉన్నా.. తుంగభద్రవైపు మాత్రం మెరుగ్గానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అక్కడి క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు మంచిగా పడే చాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి కూడా వరద జలాలను కోరే అవకాశం లేకపోలేదు. ఇటు సుంకేశుల ఎగువన ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో శ్రీశైలానికి స్వల్పంగా వరద వస్తున్నది. 5 వేల నుంచి 6 వేల క్యూసెక్కుల దాకా నీళ్లొస్తున్నాయి.
ఈ నెల 25న మూడు రాష్ట్రాల సీఎంల భేటీ!
ఈ నెల 25న మూడు రాష్ట్రాల సీఎంల కీలక సమావేశం జరగనుంది. తెలంగాణ, ఏపీ, కర్నాటక సీఎంలు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. 2024లో వచ్చిన వరదలకు తుంగభద్ర డ్యామ్లోని ఒక గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కర్నాటక.. పాత గేట్లను తీసి కొత్తగేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 33 గేట్లను బిగించాలని నిర్ణయించి చకచకా పనులు ప్రారంభించింది. కేవలం ఆరు నెలల్లోనే గేట్లను మార్చింది. ఈ నెల 25న కొత్త గేట్లతో ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మన సీఎం రేవంత్ రెడ్డిని కర్నాటక సీఎం ఆహ్వానించారు. ఆ మీటింగ్కు వెళ్లేందుకు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. మన సీఎం కూడా వెళ్లే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అదే రోజు ఇద్దరు సీఎంలతో నీటి వినియోగంపై సీఎం రేవంత్ చర్చించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. కరువు నేపథ్యంలో ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల, వినియోగంపై ఏపీ, కర్నాటక సీఎంలతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
