బెంగళూరు: కర్నాటకలోని తుమకూరు జిల్లాలో నెల రోజులకు పైగా కనిపించకుండా పోయిన ఒక టీనేజ్ అమ్మాయిని సొంత తండ్రే హత్య చేసి ఉంటాడని అనుమానాస్పద కేసు నమోదైంది. శిర తాలూకాలోని నింబేమరదహళ్లి గ్రామంలో తన తల్లిదండ్రులతో నివసిస్తున్న మేఘన(17 ) మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, మేఘన ఏప్రిల్ 16న అదృశ్యమైంది. సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో రోజువారీ కూలీ పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన ఆమె తల్లి నిర్మల, తన కూతురు ఇంట్లో కనిపించకపోవడంతో నివ్వెరపోయింది.
ఆమె ఫోన్కు కాల్ చేయగా, స్విచ్ ఆఫ్ చేసి ఉంది. మేఘన కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేఘన పెళ్లి విషయంలో కుటుంబంలో తరచుగా వాదనలు జరుగుతుండేవని అధికారులు తెలిపారు. మేఘనకు 18 ఏళ్లు నిండిన తర్వాత, ఒక బంధువు కొడుకుతో పెళ్లి చేయాలని నిర్మల, ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, తిమ్మరాయప్ప తన కుమార్తెకు తన భార్య బంధువులతో జరిగే పెళ్లిని వ్యతిరేకించినట్లు, ఈ విషయంపై గత నాలుగైదు నెలలుగా ఇంట్లో వివాదాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరుసటి రోజే మేఘన అదృశ్యమైంది. పోలీసుల విచారణలో తిమ్మరాయప్ప తన నేరాన్ని అంగీకరించినట్లు చెబుతున్నారు. అతను మొదట మేఘనను బావిలోకి తోసి, ఆపై ఆమెపై రాళ్లు విసిరాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తర్వాత, ఆమె మృతదేహాన్ని బావి నుంచి వెలికితీసి, ఒక నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టాడు.
