ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వంటింటి చిట్కాలు పాటిస్తున్న జనం

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వంటింటి చిట్కాలు పాటిస్తున్న జనం

కరోనా భయంతో జనం ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వంటింటి చిట్కాలు పాటిస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు తులసి, ఇతర ఔషధ మొక్కల ఆకులతో వేడినీళ్లు కాచుకుని తాగుతున్నారు. తులసి ఆకులు ఇమ్యూనిటీ బూస్టర్లుగా పనిచేస్తాయని…నర్సరీల్లో ఔషధ మొక్కలు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదానికి మళ్లీ డిమాండ్ వచ్చింది. కరోనా వైరస్ తో…ఇంగ్లీష్ మెడిసిన్స్ వదిలి ఆయుర్వేదం, హోమియోకి ప్రాధాన్యత ఇస్తున్నారు జనం. ఇందులో భాగంగా పాతకాలం నాటి పద్దతులు ఫాలో అవుతున్నారు. ఇంటి ఆవరణలో ఉండే మొక్కలు, పోపుల డబ్బాలో ఉండే దినుసులను తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉండవన్న నిపుణుల సూచనతో ఔషధ మొక్కల పెంపకంపై దృష్టిపెడుతున్నారు.

వీటిని పెరటి మొక్కలుగా పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలు పెంచడం, గార్డెనింగ్ చేయటాన్ని చాలామంది హబీగా పెట్టుకుంటారు. అదే పనిగా వారానికి ఒక మొక్కలు కొనేవాళ్ళూ ఉంటారు. ఇప్పుడు వీరికి ఔషధ మొక్కలు పెంచేవాళ్లు తోడయ్యారు. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోడానికి పెరట్లో ఔషధ మొక్కలను నాటుకుంటున్నారు. జనం డిమాండ్ తో నర్సరీల్లో పూలు, పండ్లు, ఇంటీరియర్ డిజైనింగ్ మొక్కలతో పాటు ఔషద మొక్కలు కూడా అందుబాటులోకి వచ్చాయి. గతంలో పోలిస్తే….ఔషధ మొక్కలే ఎక్కువ అమ్ముడు పోతున్నట్టు చెబుతున్నారు నర్సరీల నిర్వాహకులు.

తులసీ, వాము, వేప, ఉసిరి, అల్ల నేరేడు, కలబంద, పసుపు, గన్నేరు లాంటి మొక్కలకు డిమాండ్ ఉంటోంది. దాదాపు 20 వేల రకాలను అందుబాటులో ఉంచామంటున్నారు నర్సరీల ఓనర్లు. 20 రూపాయలు మొదలు… లక్షన్నర వరకు వివిధ రకాల విదేశీ మొక్కలు కూడా ఉన్నాయంటున్నారు. కరోనా సమయం కావడంతో… ఇప్పటి వరకు నర్సరీల వంక చూడని వారు కూడా ఔషధ మొక్కల కోసం క్యూలు కడుతున్నారు.