- సర్కారు కాలేజీల్లో కన్వీనర్ కోటా ఫీజు రూ.50 వేలు
- ప్రైవేటులో మినిమమ్ ఫీజు రూ.35 వేలే
- రెండేండ్లలో మూడింతలు పెంచిన వర్సిటీలు
- సెల్ఫ్ ఫైనాన్స్కోర్సుల్లో సీటుకు రూ.లక్ష ఫీజు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు భారీగా పెరిగాయి. ప్రైవేటు కాలేజీలకు ధీటుగా జేఎన్టీయూ, ఉస్మానియా వర్సిటీ ఫీజులు ఫిక్స్ చేశాయి. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో మినిమమ్ ఫీజు రూ.35 వేలు ఉండగా, వర్సిటీ క్యాంపస్, సర్కారు కాలేజీల్లో మాత్రం రూ.50 వేలకు పెంచేశారు. గడిచిన రెండేండ్లలోనే సర్కారు కాలేజీల్లో మూడింతల ఫీజు పెరిగింది. సెల్ఫ్ఫైనాన్స్లోనూ ప్రైవేటు కాలేజీలకు పోటీగా రూ.లక్ష ఫీజును నిర్ణయించారు. ఓయూలో నిరుడే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కోర్సుకు ఏకంగా రూ.1.20 లక్షలుగా పెట్టారు. జేఎన్టీయూ, ఓయూ వర్సిటీలు వరుసగా రెండేండ్లు బీటెక్ ఫీజులు పెంచడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఇబ్బందులు పడ్డాల్సి వస్తోంది. అయితే సర్కారు యూనివర్సిటీల్లో ప్రైవేటు కాలేజీల్లా ఫీజులు పెంచడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈసీల్లో నిర్ణయం తీసుకొని..
రాష్ట్రంలో172 ఇంజినీరింగ్ కాలేజీలుండగా వాటిల్లో 70 వేల వరకు కన్వీనర్ కోటా సీట్లుంటాయి. వీటిలో ఏడు యూనివర్సిటీల పరిధిలో16 కాలేజీల్లో4,285 ఇంజినీరింగ్ అనుబంధ సీట్లున్నాయి. వీటిలో జేఎన్టీయూ, ఓయూ, కేయూ వర్సిటీలు కీలకం. ఒక్క జేఎన్టీయూ పరిధిలో ఆరు కాలేజీల్లో 2,430 సీట్లుండగా, ఓయూలో 620, కేయూలో1020 సీట్లున్నాయి. మిగిలిన సీట్లు ఎంజీయూ, అగ్రికల్చర్, వెటర్నరీ, జేఎన్ఏఎఫ్ఏయూ తదితర వాటిలో ఉన్నాయి. అయితే జేఎన్టీయూ, ఓయూ, కేయూల్లో 2020–21 అకడమిక్ఇయర్కన్వీనర్ కోటాలో రూ.18 వేల ఫీజు ఉండగా, 2021–22 ఏడాదిలో దాన్ని రూ.35 వేలకు పెంచారు. తాజాగా ఈ విద్యాసంవత్సరం ఆ ఫీజును జేఎన్టీయూ, ఓయూల్లో రూ.50 వేలు చేశారు. ఈ రెండు వర్సిటీలు తమ ఈసీల్లో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించుకోవడం గమనార్హం. కేయూలో మాత్రం రూ.35 వేలను అలాగే కొనసాగిస్తున్నారు.
సెల్ఫ్ఫైనాన్స్ఫీజు లక్ష..
నాలుగు వర్సిటీల్లో 21 కోర్సుల్లో1110 సీట్లు సెల్ఫ్ఫైనాన్స్కోర్సుల సీట్లున్నాయి. వీటిలో ఫైనార్ట్స్వర్సిటీలో మొత్తం160 సీట్లకు160 సీట్లూ సెల్ఫ్ఫైనాన్స్లోనే నడుస్తున్నాయి. ఈ కోర్సు ఫీజు రూ. 65 వేలు ఉంది. జేఎన్టీయూలో 390 సీట్లు, కేయూలో 370 సీట్లు, ఓయూలో 190 సీట్లున్నాయి. ఓయూలో ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ అండ్ మిషన్ లర్నింగ్లో ఏకంగా రూ.1.20 లక్షల ఫీజు ఉండగా, మిగిలిన కోర్సుల్లో రూ.లక్ష ఫీజు ఉంది. ఈ ఏడాది తీసుకొస్తున్న బయోమెడికల్ కోర్సులో పది సీట్లు పెట్టగా, దానికి రూ.75 వేల ఫీజు నిర్ణయించారు. జేఎన్టీయూలో ఇంటిగ్రేటెడ్ బీటెక్తో పాటు ఇతర అన్ని కోర్సుల్లో ఫీజు రూ.లక్షగా ప్రకటించారు.
విద్యార్థులపై భారం..
కన్వీనర్ కోటాలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్లకు, ఇంటర్సర్కారు కాలేజీల్లో చదివిన వారికి ఏ ర్యాంకు వచ్చినా, వారి ఫీజును సర్కారే రీయింబర్స్ మెంట్ రూపంలో ఇస్తోంది. కానీ బీసీలు, ఓసీలకు మాత్రం ఎంసెట్లో10 వేల ర్యాంకు వచ్చిన వారికే మొత్తం ఇస్తుండగా, మిగిలిన వారికి రూ.35 వేలు మాత్రమే ఇవ్వనుంది. అయితే విద్యార్థుల పేరెంట్స్కు రూరల్లో రూ.లక్షన్నర, అర్బన్లో రెండు లక్షలకు మించి ఆదాయం ఉండొద్దు. దీంతో చాలామంది చిన్నచిన్న ఉద్యోగుల పిల్లలూ స్కాలర్ షిప్లకు అనర్హులుగా మారుతున్నారు. ఇవే రూల్స్ సెల్ఫ్ఫైనాన్స్ స్టూడెంట్లకు వర్తిస్తున్నాయి. అయితే సర్కారు కాలేజీల్లో మెజార్టీగా పదివేల లోపు ర్యాంకు వచ్చిన వారే ఉంటారని వర్సిటీల అధికారులు చెప్తున్నారు. ఏటా70 శాతం మందికి సర్కారు నుంచే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని, 25–30% మంది మాత్రమే ఫీజు చెల్లిస్తారని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఒకేసారి కన్వీనర్ కోటా ఫీజుతో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో ఫీజులు పెంచడంపై పేరెంట్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.