- వైన్స్ ఎదుట ఆందోళన
- బీర్లన్నీ బెల్ట్షాపులకే అమ్ముకుంటున్నారని ఆగ్రహం
- మానుకోట జిల్లా గూడూరులో ఘటన
మరిపెడ(చిన్నగూడూరు),వెలుగు : మహబూబాబాద్జిల్లా గూడూరులో హోలీ రోజు లైట్బీర్ల కోసం ఓ వైన్స్ ఎదుట యువకులు ఆందోళన చేశారు. స్థానికుల కథనం ప్రకారం..మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో సోమవారం పలువురు యువకులు హోలీ ఆడుకున్నారు. తర్వాత ఎండల నుంచి చిల్ అవ్వడానికి మండల కేంద్రంలోని భద్రకాళి వైన్స్ వద్దకు వెళ్లి లైట్ బీర్లు కావాలని అడిగారు. అయితే, బీర్లు లేవని చెప్పడంతో ఆగ్రహించిన యువకులు తమకు లైట్బీర్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.
దీంతో షాపు నిర్వాహకులు తమ దగ్గర లేవని, బెల్ట్ షాపులో దొరుకుతాయని, అక్కడే కొనుక్కోవాలని సలహా ఇచ్చారు. దీంతో సదరు యువకులు ‘అన్ని బీర్లు బెల్ట్ షాపులకు అమ్ముకుంటే మేం ఏం తాగాలి? ఎక్కడ తాగాలి. అక్కడ రూ.180 తీస్కుంటున్నరు’ అని హంగామా సృష్టించబోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన యువకులకు సర్ది చెప్పి పంపారు.