- ఉపాధి బిల్లులు, ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులు
- పంచాయతీల్లో ముందుకు సాగని అభివృద్ధి పనులు
- రెండు శాఖల బాధ్యతలతో డైరెక్టర్ సతమతం
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ శాఖలో పాలన మందగించింది. శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన కమిషనరేట్ స్థాయిలోనే కీలకమైన ఫైళ్లు వారాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. డైరెక్టర్ సంతకం కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పంచాయతీ రాజ్ డైరెక్టర్గా ఉన్న అధికారే.. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండు కీలకమైన శాఖలకు ఒకే అధికారి ఉండటం, పనిభారం పెరిగిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ప్రస్తుతం ఫైల్స్ డైరెక్టర్ లాగిన్లో పెండింగ్లో ఉండడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు, సర్పంచులు వాపోతున్నారు. సర్పంచ్ ఎన్నికలకు ముందు ఉపాధిహామీ కింద గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. ఇందుకు సంబంధించి కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు మెటీరియల్ కాంపోనెంట్ బిల్లుల చెల్లింపు ఫైల్స్ పెండింగ్ పెట్టారు.
అటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పలువురు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లకు సంబంధించిన ఫైల్స్ కూడా క్లియర్ కావడం లేదు. ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, సూపరింటెండెంట్ల స్థాయి అధికారుల ప్రమోషన్లు, డిప్యూటేషన్ ఫైల్స్ కూడా పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీలకు రావాల్సిన గ్రాంట్లు, ఇతర నిర్వహణ నిధుల విడుదలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్స్ కూడా ఆలస్యం అవుతున్నాయి.
కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, వేగం కోసం ఈ- ఆఫీస్ విధానం తెచ్చారు. ఫైల్ డిజిటల్గా ఉన్నా.. దానిని పరిశీలించి, డిజిటల్ సంతకం పెట్టి అప్రూవ్ చేయాల్సింది అధికారే. ప్రస్తుతం డైరెక్టర్ శ్రుతి ఓఝాకు పంచాయతీ రాజ్శాఖతోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. దీంతో అంగన్వాడీ సమస్యలు, పోషకాహార పంపిణీ వంటి అంశాలపై ఆమె ఎక్కువ ఫోకస్ పెట్టడంతో వల్ల పీఆర్ ఫైల్స్ పెండింగ్ పడ్తున్నాయని సంబంధిత అధికారులు చెప్తున్నారు.
