హైదరాబాద్, వెలుగు: కారుణ్య నియామకాల భర్తీ కోసం వివిధ శాఖల్లో 1,266 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 1,266 దరఖాస్తులు వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరికి పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను సూపర్ న్యూమరరీ కింద జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టుల భర్తీ చేయాలన్న వివరాలను జీవోలో పేర్కొంది. ఈ పోస్టులను భర్తీ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించింది. నిజామాబాద్లో అత్యధికంగా 117 పోస్టులు ఉండగా, అతి తక్కువగా భూపాలపల్లిలో 5 పోస్టులు ఉన్నాయి. ఏండ్లుగా కారుణ్య నియామకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3,500 మంది ఎదురు చూస్తున్నట్లు ఇటీవల ‘వెలుగు’దినపత్రికలో కథనం పబ్లిష్ అయింది.

