- రూ.20 లక్షల ఆస్తి నష్టం
- ముషీరాబాద్లో భోలక్పూర్లో ఘటన
ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్పూర్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరా నగర్ సమీపంలోని సహారా ఫంక్షన్ హాల్ వెనుక నిజాముద్దీన్ అనే వ్యక్తి కట్టెల మండి నిర్వహిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి సదరు ఫంక్షన్ హాల్లో జరిగిన ఒక శుభకార్యం ముగిసిన తర్వాత, ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కొందరు పటాకులు పేల్చారు. ఆ పటాకుల నిప్పు రవ్వలు ఎగిరి పక్కనే ఉన్న కట్టెల మండిపై పడటంతో మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ముషీరాబాద్ పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 6 ఫైర్ ఇంజిన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు నిజాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు కాలేదని, దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని పోలీసులు తెలిపారు.
