న్యూఢిల్లీ: కరోనా సమస్యలు, మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పటికీ విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్పీఐలు) డిసెంబర్లో భారతీయ ఈక్విటీలలో నికరంగా రూ. 11,557 కోట్లను పెట్టుబడిగా మార్చారు. ఇకముందు యూఎస్, కొవిడ్ వార్తల నుంచి వచ్చే స్థూల డేటా ఎఫ్పీఐ ఫ్లోలను, మార్కెట్లను నడిపిస్తుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ అన్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) డిసెంబర్ 1-–23 మధ్య కాలంలో ఈక్విటీలలో రూ.11,557 కోట్ల నికర పెట్టుబడి పెట్టారు. డాలర్ ఇండెక్స్ బలహీనపడటం మొత్తం స్థూల ఆర్థిక ధోరణుల పట్ల సానుకూలత కారణంగా నవంబర్లో రూ. 36,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇదే ఏడాది అక్టోబర్లో రూ.8 కోట్లు, సెప్టెంబర్లో రూ.7,624 కోట్లను ఎఫ్పీఐలు వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీల లెక్కలు వెల్లడించాయి. ఈనెల 23తో ముగిసిన వారంలో నెట్ ఇన్ఫ్లో పరిమాణం చాలా తక్కువగా రూ.1,000 కోట్ల వరకు ఉంది. అంతకుముందు వారంలో రూ.6,055 కోట్లు వచ్చాయి.
డిసెంబరు మొదటి సగ భాగంలో, ఎఫ్పీఐలు ఆటోలు, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసిజి, రియల్ ఎస్టేట్ స్టాక్లను బాగా కొన్నారు. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ఫైనాన్షియల్లలో పెట్టుబడులను అమ్మేశారు. 2022లో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్పీఐలు రూ. 1.21 లక్షల కోట్ల నికర మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. డిసెంబరులో డెట్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,900 కోట్ల నికర మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు. భారతదేశం మినహా, ఈ నెలలో ఇప్పటివరకు ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, తైవాన్, థాయిలాండ్ ఇండోనేషియా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎఫ్పీఐ ఫ్లో ప్రతికూలంగా ఉంది.