
హైదరాబాద్, వెలుగు : యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ల భర్తీల్లో సగం పోస్టులను బీసీలకు కేటాయించాలని సీఎం రేవంత్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎం రేవంత్కు లేఖ రాశారు.
రాష్ట్రంలోని ప్రధాన వర్సిటీల్లో ఈ నెలాఖరుకు వీసీ పోస్టులు ఖాళీ అవుతున్నాయని, అందులో బీసీలకు కనీసం ఐదు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వీసీల నియామకాల్లో సామాజిక న్యాయాన్ని పాటించాలని కోరారు. ఇప్పటికే వీసీల భర్తీకి సెర్చ్కమిటీలను వేశారని, ఆ కమిటీల్లో బీసీలున్నా, లేకపోయినా పోస్టుల భర్తీలో మాత్రం బీసీలను పరిగణనలోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అన్ని అర్హతలుండి ప్రతిభ ఉన్న బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.