
తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటానని చెప్పిన వ్యక్తి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రాంతం వాడే దోచుకుంటే పొలిమేర దాటే వరకు తరుముతామని చెప్పిన మాటను మరిచారని గుర్తు చేశారు. గ్రామ సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. బిఆర్ఎస్ భారతదేశానికి ఎందులో ఆదర్శమో చెప్పాలని జూపల్లి డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే ఆత్మీయ సమ్మేళనానికి వచ్చానని చెప్పారు.
హైదరాబాద్ లో ధర్నా చౌక్ ను ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ప్రభుత్వ ఖజానా, ఆస్తిని ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ల ద్వారా కాంట్రాక్టర్ల నుంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దళిత బంధుతో ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే తొలి దళ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన జిల్లా అన్నారు జూపల్లి. తిండి లేకున్నా ఉండవచ్చు కానీ.. ఆత్మ గౌరవం లేని చోట ఉండలేమన్నారు. బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ముఖ్యమంత్రి అంటే ట్రస్టి అనే విషయాన్ని మరిచిపోయి నాది అనే ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఉద్యమకారులను అణచివేసే, అవమానించే కార్యక్రమం జరుగుతోందన్నారు. 12 మంది MLAలను అప్రజాస్వామికంగా చేర్చుకున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ స్పూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
మూడున్నర సంవత్సరాల ముందు తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నానని... సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలంగాణ మంత్రులు పదవి లేకుండా ఉండలేరని విమర్శిస్తే రాజీనామా చేశానని గుర్తు చేశారు. 2011లో రాజీనామా చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేసి గెలిచానన్నారు. 2018 లో టిఆర్ఎస్ ను 13 స్థానాల్లో గెలిపించానన్నారు. పోలీసుల వేధింపుల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరితే వినే పరిస్థితి లేదన్నారు. ప్రగతి భవనం నుంచి జీరో యాక్షన్ ఉందని... తెలంగాణలో ప్రతి పక్ష నాయకులు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని విమర్శించారు.