పారిస్ :ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో బుధవారం ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ శుభారంభం చేయగా.. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ ఫస్ట్ రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మహిళల సింగిల్స్ ఫస్ట్ రౌండ్లో తొమ్మిదో సీడ్ సైనా 23–21, 21–17తో 25వ ర్యాంకర్ యి చెంగ్ (హాంకాంగ్)పై పోరాడి గెలిచింది. 42 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో సైనాకు ప్రత్యర్థి నుంచి గట్టి సవాల్ ఎదురైంది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ 21–15, 7–21, 14–21తో వరల్డ్ నంబర్ 2 చౌతీన్చన్(చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. సమీర్ వర్మ 22–20, 18–21, 18–21తో నిషిమోటో(జపాన్) చేతిలో ఓడగా, 26వ ర్యాంకర్ కశ్యప్ 11–9, 9–21తో వరల్డ్ నంబర్ 9 లాంగ్ ఎంగస్(హాంకాంగ్) చేతిలో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నాకౌటయ్యాడు.
పురుషుల డబుల్స్ ఫస్ట్ రౌండ్లో సాత్విక్–చిరాగ్ జోడీ 21–16, 21–14 తబ్లింగ్–మాస్ (నెదర్లాండ్స్)పై గెలిచింది. కానీ, సుమీత్–మను అత్రి 19–21,22–20,15–21తో వి లేన్–వెన్డెక్ (ఇంగ్లండ్) జంట చేతిలో ఓడింది.ఇక, మిక్స్డ్ డబుల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్లో అశ్విని పొన్నప్ప – సాత్విక్ జోడీ 17–21, 18–21తో నాలుగో సీడ్ కొరియా జంట సియో సెంగ్జో– చొ యుజంగ్ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్లో ప్రణవ్ జెర్రీ చొప్రా– సిక్కిరెడ్డి జంట 13–21, 18–21తో ఇంగ్లండ్కు చెందిన క్రిస్ ఎడ్కాక్– గాబ్రియెల్ ఎడ్కాక్ జోడీచేతిలో ఓడింది.