డిసెంబర్ 7 నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తా : కేఏ పాల్

డిసెంబర్ 7 నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర  చేస్తా : కేఏ పాల్

డిసెంబర్ 7 నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. తమ సత్తా మునుగోడు ఎన్నికలలో ప్రజలు చూశారని, మునుగోడు ఎన్నికల్లో ఈవీఎంలు మార్చే స్థితికి, గతికి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేరాయని విమర్శించారు. ఈవీఎంలు మార్చి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నాలుగోసారి గెలవబోతుందన్న పాల్... ఈవీఎం లు మనకు వద్దని, అమెరికా మాదిరిగా బ్యాలెట్ పేపర్ లు కావాలని  కోరుకుందామని చెప్పారు. డిసెంబర్ 13న నల్గొండ లోని ఎస్.ఆర్.ఎన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా పొలిటికల్ లీడర్స్, క్యాస్ట్ లీడర్స్, స్టూడెంట్స్ లీడర్స్ తో తాను ప్రత్యేకంగా సమావేశమవుతానని కేఏ పాల్ అన్నారు.  

అక్టోబర్ 30న మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపిస్తే 15 రోజుల్లో మునుగోడు ను అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కానీ ముప్పై రోజులు అయినా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని, ఊరేగింపులకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. ‘‘ తెలంగాణ బిడ్డలారా అవినీతి పరులను మీరు నమ్ముతారా... ఢిల్లీ, పంజాబ్ ప్రజల్లాగా మార్పు కోరుకుంటారా’’ అని పాల్ ప్రశ్నించారు. తాను వారం రోజులు అమెరికాకు వెళ్లి వచ్చే సరికి రాష్ట్రం  రావణ కాష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. ఈడీ రైడ్స్ ద్వారా టీఆర్ఎస్ నాయకుల దగ్గర వేల కోట్ల రూపాయలు పట్టుబడటం మనం చూస్తున్నామని చెప్పారు. వందల కోట్ల రూపాయలతో బీజేపీవారు ఎమ్మెల్యే లను కొనడం కూడా మనం చూస్తున్నామన్నారు. ఈ ఎన్నికలే లాస్ట్ ఎన్నికలని ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కావాలా...మార్పు కోరుకుంటున్నారా... అని ప్రజలను అడిగారు.

కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని కేఏ పాల్ ఆరోపించారు. మోడీ పాలనలో ప్రపంచ దేశాలు భారత్ కు అప్పులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేవన్న ఆయన.. షర్మిల వార్తలు మీడియా వారు కవర్ చేయకండని చెప్పారు. షర్మిల అన్న జగన్ నాలుగేళ్ళ లో రాజన్న రాజ్యం తీసుకొని రాలేదని, రాక్షస రాజ్యం, అవినీతి రాజ్యం తీసుకొని వచ్చారని తెలిపారు. జగన్ ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొని రాలేదన్న కేఏ పాల్... చివరికి జగన్ మోడీ గారికి మసాజ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రపంచానికి తెలుగు వారి సత్తా చూపానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వండని పాల్ కోరారు.