పెట్రో మోత..లీటరుకు 90 పైసలు హైక్.. వారంలోనే రెండోసారి ..సామాన్యుడిపై ప్రభావం

పెట్రో మోత..లీటరుకు 90 పైసలు హైక్.. వారంలోనే రెండోసారి ..సామాన్యుడిపై ప్రభావం
  • లీటరుకు దాదాపు 90 పైసలు హైక్.. వారంలోనే రెండోసారి 
  • ఢిల్లీలో పెట్రోల్ రూ. 98.64కు, 
  • డీజిల్ రూ. 91.58కి పెరుగుదల  
  • నిత్యావసర సరుకుల ధరలూ పైపైకి.. 
  • సామాన్యుడిపై ప్రభావం 

న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు వారంలోనే రెండోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు 90 పైసలు పెంచాయి. నాలుగు రోజుల క్రితం శుక్రవారమే లీటరుకు రూ. 3 చొప్పున పెంచిన కంపెనీలు మళ్లీ మూడు రోజులకే మరోసారి ధరలను పెంచాయి. 90 పైసల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.77 నుంచి రూ. 98.64కు.. డీజిల్ ధర లీటరుకు రూ. 90.67 నుంచి రూ. 91.58కు పెరిగింది.

తాజాగా మంగళవారం నాటి పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ రేటు మరో 87 పైసలు పెరిగి లీటరు రూ. 98.64కు చేరింది. డీజిల్ రేటు కూడా 91 పైసలు పెరిగి లీటరు రూ. 91.58కి చేరింది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 91 పైసలు పెరిగి రూ. 107.59కి.. డీజిల్ ధర 94 పైసలు పెరిగి లీటరు రూ. 94.08కి చేరుకుంది. కోల్‌‌‌‌‌‌‌‌కతాలో పెట్రోల్ అత్యధికంగా 96 పైసలు పెరిగి లీటరు రూ. 109.70కి చేరింది. డీజిల్ 94 పైసలు పెరిగి లీటరు రూ. 96.07కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్ 82 పైసలు పెరిగి లీటరు రూ. 104.49కి చేరగా, డీజిల్ 86 పైసలు పెరిగి లీటరు రూ. 96.11కి చేరింది.

జనంపై మరింత భారం  

పశ్చిమాసియా యుద్ధంతో తలెత్తిన ఇంధన సంక్షోభంతో అతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆ లోటును పూడ్చుకునేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇదివరకే రూ. 3 చొప్పున ధరలు పెంచాయి. అయినా, నష్టాలు పూర్తిగా భర్తీ కాలేదని చెప్తున్నాయి. ఆయా కంపెనీల ఖర్చులు పెరుగుతున్నప్పటికీ దాదాపు 10 వారాల పాటు పాత ధరలకే ఇంధనాన్ని విక్రయించాయని, వాటి నష్టాలు భరించలేని స్థితికి చేరుకోవడంతో, గత వారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాల్సి వచ్చిందని పేర్కొంటున్నాయి.

 అయితే, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అన్ని నిత్యావసర వస్తువుల ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది. చిన్న వ్యాపారులు, రవాణా రంగంలో ఉన్నవారు, ప్రజా రవాణాపై ఆధారపడే సామాన్య ప్రజలు, ప్రతిరోజూ స్వంత వాహనాలను ఉపయోగించే వారు ఈ పెంపుతో ప్రత్యక్షంగా ప్రభావితం అవుతున్నారు. పెట్రోల్ ధరల పెంపుతో ఇప్పటికే పాల ధరలు కూడా పెరిగాయి. ఇంధన ధరలు పెరగడంతో బ్రెడ్ తయారీ, సరఫరా ఖర్చు కూడా పెరిగిందంటూ ప్రముఖ బ్రాండ్ల బేకరీలు తమ బ్రెడ్ ధరలను పెంచుతున్నాయి.

60 శాతం పెరిగిన దిగుమతి వ్యయం 

పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ మంగళవారం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరిగాయి. ఫిబ్రవరిలో బ్యారెల్ సగటు ధర 69.01 డాలర్లుగా ఉండగా, 81 రోజులుగా కొనసాగుతున్న ఘర్షణల మధ్య మే 15 నాటికి బ్యారెల్ ధర 110.73 డాలర్లకు పెరిగింది. అంటే ఫిబ్రవరి సగటుతో పోలిస్తే ముడి చమురు ధరలు బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 41.72 డాలర్లు పెరిగాయి.- ఇది మొత్తం మీద 60.45 శాతం పెరుగుదల. 

భారతదేశం తన ముడిచమురు అవసరాలలో 85 శాతానికి పైగా, ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ అవసరాలలో దాదాపు 60 శాతాన్ని అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సుమారు 40 శాతం ముడి చమురు, 90 శాతం ఎల్‌‌‌‌‌‌‌‌పీజీ హార్మూజ్ జలసంధి ద్వారానే వస్తాయి. అయితే, అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా హార్మూజ్ జలసంధి ద్వారా సరుకు రవాణా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా, ముడి చమురు దిగుమతులపై భారతదేశం పెట్టే మొత్తం వ్యయం 60 శాతానికి పైగా పెరిగింది.