గాంధీ, నిమ్స్, ఉస్మానియా దవాఖానాలకు వెళ్లే పేదలకు గుడ్ న్యూస్..

 గాంధీ, నిమ్స్, ఉస్మానియా దవాఖానాలకు వెళ్లే పేదలకు గుడ్ న్యూస్..
  • ఒక్కో ఆసుపత్రికి ముగ్గురు చొప్పున ట్రాన్స్​ప్లాంటేషన్ సర్జన్ల నియామకం
  • ఏ అవయవమైనా ట్రాన్స్​ప్లాంట్​చేసేలా ఏర్పాట్లు
  • పేద రోగుల కోసం సర్కార్ నిర్ణయం
  • ట్రామా కేర్ సెంటర్లు ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లగా ఆధునికీకరణ
  • రాష్ట్రంలో గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర మోడల్    

హైదరాబాద్, వెలుగు: నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవయవ మార్పిడి చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ, నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులను అత్యాధునిక అవయవ మార్పిడి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ మూడు ఆసుపత్రుల్లో ఒక్కో దాంట్లో ముగ్గురు చొప్పున నిష్ణాతులైన ట్రాన్స్‌‌ప్లాంటేషన్ సర్జన్లను నియమించనుంది. 

కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులు వంటి ఏ అవయవాన్ని మార్చేందుకైనా అవసరమైన సకల సౌకర్యాలను కల్పించనున్నారు. ఇందులో గాంధీ హాస్పిటల్​లో సూపర్ స్పెషాలిటీ ఇన్ ట్రాన్స్​ప్లాంట్ సైన్సెస్​గా తీర్చిదిద్దుతోంది. ఈ ట్రాన్స్​ప్లాంట్ కేంద్రాల్లో కిడ్నీ, లివర్‌‌, గుండె, ఊపిరితిత్తులు, కార్నియా వంటి అన్ని రకాల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేపట్టేందుకు అవసరమైన సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. 

అత్యాధునిక ఆపరేషన్‌‌ థియేటర్లు, ఇంటెన్సివ్‌‌ కేర్‌‌ యూనిట్లు (ఐసీయూ), అవయవ సంరక్షణకు అవసరమైన కోల్డ్‌‌ స్టోరేజ్‌‌ వ్యవస్థలు, అధునాతన డయాగ్నస్టిక్‌‌ సాంకేతికతలతో ఈ కేంద్రాలు సమకూరనున్నాయి. ఈ సౌకర్యాలు పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి.

ట్రామా కేర్ సెంటర్ల ఆధునికీకరణ

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న ట్రామా కేర్‌‌ సెంటర్లను ఆర్గాన్‌‌ రిట్రైవల్‌‌ సెంటర్లుగా ఆధునికీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్ వారి అవయవాలను సేకరించేందుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని ట్రామా కేర్ సెంటర్లను ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లుగా మారుస్తారు. ఇది అవయవ దాన ప్రక్రియను సులభతరం చేయడమే కాకుండా, అవసరమైన వారికి సకాలంలో అవయవాలు లభించేందుకు దోహదపడుతుంది. 

ఈ కేంద్రాలు బ్రెయిన్‌‌ డెడ్‌‌ కేసుల్లో అవయవాలను సేకరించి, వాటిని సంరక్షించి, అవసరమైన రోగులకు మార్పిడి చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రక్రియలో వేగం, సమర్థత, పారదర్శకతను నిర్ధారించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నారు. అవయవ మార్పిడి వ్యవస్థను బలోపేతం చేసేందుకు మహారాష్ట్ర, గుజరాత్‌‌, తమిళనాడు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న మోడళ్లను తెలంగాణ అధికారులు స్టడీ చేశారు. 

ఈ రాష్ట్రాల్లో అవయవ దానం, సేకరణ, మార్పిడి ప్రక్రియల్లో అనుసరించే పారదర్శక విధానాలు, సమన్వయ వ్యవస్థ, ప్రజా చైతన్య కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులో అవయవ దానం చైతన్య కార్యక్రమాలు, గుజరాత్‌‌లో ఆర్గాన్‌‌ రిట్రైవల్‌‌ సెంటర్ల నిర్వహణ, మహారాష్ట్రలో అవయవ మార్పిడి సమన్వయ వ్యవస్థలు అనుసరించేలా ప్లాన్​ చేసింది.  

‘తోటా’ యాక్ట్ తో అక్రమ దందాకు చెక్ 

రాష్ట్రంలో అక్రమ అవయవ మార్పిడి దందాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ‘ట్రాన్స్‌‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్’(తోటా)ను అమలు చేస్తున్నది. అవయవ మార్పిడి ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అవయవ దానం, సేకరణ, మార్పిడి ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఒక కేంద్రీకృత డిజిటల్‌‌ ప్లాట్​ఫామ్​ను ఏర్పాటు చేస్తున్నారు. 

దీంతో అవయవదాతలు, గ్రహీతల వివరాలను రియల్‌‌ టైంలో ట్రాక్‌‌ చేయవచ్చు. ఈ  చర్యలతో పేదల ఆశలను సొమ్ము చేసుకోవాలని చూసే అక్రమ మార్పిడి ముఠాలకు పూర్తిగా చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. అవయవ మార్పిడి చికిత్స ఖరీదైన వ్యవహారం కావడంతో, పేదలపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసేలా ప్లాన్ చేస్తున్నది.