బీసీసీఐలో ‘దాదాగిరి’ ఇంకో ఐదేళ్ల పాటు కొనసాగేందుకు రంగం సిద్ధమవుతోంది. మరో తొమ్మిది నెలల్లోనే ప్రెసిడెంట్ కుర్చీ నుంచి సౌరవ్ గంగూలీ దిగిపోవాలని శాసిస్తున్న కూలింగ్–ఆఫ్ పిరియడ్ నిబంధనను మార్చేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఈ రూల్ను సవరించాలని తమ తొలి జనరల్ బాడీ మీటింగ్లోనే దాదా నేతృత్వంలోని బోర్డు కొత్త కార్యవర్గం డిసైడైంది.అందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. అలాగే, ఇండియా క్రికెట్కు సేవ చేసేందుకు ముందుకొస్తున్న సమర్థుల కాళ్లకు అడ్డుపడుతున్న కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ రూల్ను కూడా ఎత్తివేయాలని, బోర్డు రాజ్యాంగానికి ఎలాంటి సవరణ చేయాలన్నా సుప్రీం అనుమతి అవసరం లేదని, దాన్ని ఏజీఎమ్కే కట్టబెట్టాలని నిర్ణయించింది. వీటికి కూడా ఆమోదం తెలపాలని సుప్రీంను కోరనుంది. సుప్రీం ఓకే చెబితే.. దాదా 2024 వరకూ ప్రెసిడెంట్గా కొనసాగడంతోపాటు పాలనలో సమూల మార్పులు జరగనున్నాయి.
ముంబై: ఊహించిందే జరిగింది. బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన వెంటనే పాలనలో తనదైన శైలిలో దూసుకెళ్తున్న సౌరవ్ గంగూలీ మరో కీలక అడుగు వేశాడు. బోర్డు పగ్గాలు చేపట్టిన నెల రోజుల్లోనే ఇండియాతో డే నైట్ టెస్టు ఆడించి.. మ్యాచ్ను అత్యద్భుతంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్న దాదా.. ఇప్పుడు తన ‘మార్కు’పాలనకు అడ్డుగా ఉన్న లోధా సిఫారసులను మార్చేందుకు రెడీ అయ్యాడు. ప్రెసిడెంట్ కుర్చీలో తాను పూర్తికాలం అంటే.. 2024 వరకు కొనసాగేందుకు తొలి అడుగు వేశాడు. బీసీసీఐ లేదా రాష్ట్ర సంఘాల్లో ఆరేళ్లు పని చేసిన ఆఫీస్ బేరర్లు కచ్చితంగా మూడేళ్ల విరామం (కూలింగ్ ఆఫ్ పిరియడ్) తీసుకోవాల్సిందే అన్న లోధా కమిటీ సిఫారసును ఎత్తి వేయాలని దాదా అధ్యక్షతన ఆదివారం జరిగిన బోర్డు తొలి జనరల్ మీటింగ్ (ఏజీఎమ్) నిర్ణయించింది. దీనికి ఆమోదం తెలపాలని సుప్రీంకోర్టును కోరింది. కోర్టు దిక్కరణ చర్యలకు గురి కాకుండా ఉండేందుకు… బీసీసీఐ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ముందు సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది.
ప్రస్తుత నిబంధన ప్రకారం వచ్చే ఏడాది పదవి నుంచి తప్పుకోవాల్సి ఉన్న దాదా.. మంగళవారం జరిగే విచారణలో ఈ సవరణకు సుప్రీం ఓకే చెబితే 2024 వరకూ బీసీసీఐ బాస్గా కొనసాగుతాడు. అతనితో పాటు జై షా కూడా పూర్తి కాలం పదవిలో ఉంటాడు. బీసీసీఐ లేదా రాష్ట్ర సంఘాల్లో రెండు టర్మ్లు (ఆరేళ్లు) వేర్వేరుగా పని చేసిన వ్యక్తులకే కూలింగ్ షరతు వర్తించాలని దాదా నేతృత్వంలోని బోర్డు భావిస్తోంది. ఇక, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (సీఈసీ) మీటింగ్కు హాజయ్యే బీసీసీఐ ప్రతినిధిగా సెక్రెటరీ జై షాను ఎంపిక చేస్తూ ఏజీఎం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. గతంలో కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ) తీసుకున్న నిర్ణయాన్ని మార్చింది. సెప్టెంబర్ వరకూ బీసీసీఐని నడిపించిన సీవోఏ ఆదేశం మేరకు ఈ మీటింగ్స్కు సీఈఓ జోహ్రీ హాజరయ్యారు.
ఆరు సవరణలు.. నో ఓటింగ్
అక్టోబర్లో బోర్డు పగ్గాలు చేపట్టిన గంగూలీ ఏజీఎంలో ఆరు సవరణలు ప్రతిపాదించాడు. తన రాజ్యాంగానికి మార్పులు చేయాలని బీసీసీఐ భావించిన పక్షంలో కోర్టు జోక్యం చేసుకోకూడదన్న సవరణ ప్రధానమైనది. భవిష్యత్లో తీసుకునే రాజ్యాంగ సవరణ నిర్ణయాల్లో అత్యున్నత న్యాయస్థానం కల్పించుకోకూడదని, నాలుగింట మూడొంతుల (త్రీ-–ఫోర్త్ )మెజారిటీతో తుది నిర్ణయం తీసుకునే హక్కు ఏజీఎమ్కే ఉండాలని బోర్డు కోరుకుంటోంది. ఏ చిన్న సవరణకైనా సుప్రీంకోర్టు అప్రూవల్ తీసుకోవడం సాధ్యం కాబోదని అధికారులు భావిస్తున్నారు. దీనితో పాటు బోర్డు ఆఫీస్ బేరర్ల కూలింగ్-ఆఫ్ రూల్కు, అనర్హత నిబంధనలకు మార్పులు, బోర్డు సెక్రెటరీకి పూర్తిస్థాయి పవర్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనలను ఏజీఎంలో ఉంచారు. ఈ సవరణల గురించి జనరల్ బాడీకి దాదా చదివి వినిపించిన తర్వాత భేటీకి హాజరైన మొత్తం 38 సభ్యుల్లో మెజారిటీ మెంబర్స్ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. అయితే, సవరణల కోసం అధికారికంగా ఓటింగ్ నిర్వహించలేదు. ఈ మార్పులకు ముందుగా సుప్రీంకోర్టు ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని ఏజీఎమ్లో ప్రకటించారు. సుప్రీం అంగీకారం లేకుండా రాజ్యంగ సవరణకు ఓటింగ్ నిర్వహించి, ఆమోద ముద్ర వేస్తే కోర్టు దిక్కరణ అవుతుంది. అందుకే ముందుగా బంతిని సుప్రీంకోర్టులో ఉంచింది బోర్డు. అయితే, ఐసీసీ సీఈసీ మీటింగ్కు బీసీసీఐ సెక్రెటరీ జై షా అటెండ్ అవుతాడని గంగూలీ ప్రపోజ్చేయగా.. దీనికి జనరల్ బాడీ ఆమోదం లభించింది. కానీ, ఐసీసీ బోర్డు మీటింగ్స్కు ఎవరు హాజరుకావాలో బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఐపీఎల్లో హాల్ ఆఫ్ పేమ్.. ఫారిన్కు జట్లు!
ఐపీఎల్లో హాల్ ఆఫ్ ఫేమ్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నదని దాదా తెలిపాడు. లీగ్లో అద్భుతంగా ఆడిన ప్లేయర్లను హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చి గౌరవించాలని భావిస్తున్నామని చెప్పాడు. అలాగే, విదేశాల్లో ఆడేందుకు ఐపీఎల్ జట్లకు అనుమతించే చాన్స్ ఉందని కూడా దాదా హింట్ ఇచ్చాడు. ఫారిన్ లో ఆడేందుకు గాను ఎంత ఫీజు వసూలు చేయాలో బోర్డు నిర్ణయించనుందని సమాచారం.

