ఒడిశా టు హైదరాబాద్ గంజాయి రవాణా గ్యాంగ్ గుట్టురట్టయింది. TG ఈగల్ ఫోర్స్, వైరా పోలీసుల జాయింట్ ఆపరేషన్లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
దొరికిన గంజాయి విలువ రూ.6 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు చెప్పారు. పెద్దపల్లి నుంచి ఒడిశా వెళ్లి గంజాయి కొనుగోలు చేసి.. రూ.16 వేలకు 12 కిలోల గంజాయిని నిందితులు కొనుగోలు చేశారు. హైదరాబాద్లో గంజాయి విక్రయానికి ప్లాన్ చేశారు.
గర్ల్ఫ్రెండ్కు బర్త్డే గిఫ్ట్గా ఐఫోన్ కొనేందుకు గంజాయి దందాకు నిందితుడు పాల్పడ్డాడు. వైరా రింగ్ సెంటర్ వద్ద పోలీసుల పైకి బైక్తో దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో వైరా ఎస్ఐకు గాయాలయ్యాయి. నిందితులు కూడా బైక్పై నుంచి పడి గాయపడ్డారు.
పల్సర్ బైక్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. సప్లయర్, రిసీవర్ల కోసం గాలిస్తున్నారు. నిందితుడు చైతన్యపై ఇప్పటికే మూడు NDPS కేసులు ఉన్నట్లు తేలింది. నిందితుడు జైలు నుంచి విడుదలైన కొద్ది నెలల్లోనే మళ్లీ గంజాయి కేసులో అరెస్ట్ కావడం గమనార్హం. ఒడిశా సప్లయర్ నుంచి హైదరాబాద్ రిసీవర్ల వరకు పూర్తి నెట్వర్క్పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
