‘కేవలం ఒక్క వ్యక్తి వలన తాము ఎదగలేదు..సంపద ర్యాంకింగ్లను పట్టించుకోను..ఎన్డీటీవీ ఎడిటోరియల్లో జోక్యం చేసుకోం..ఈ ఏడాది మాకు స్పెషల్’ ఇలా అనేక విషయాలను అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
బిజినెస్ డెస్క్, వెలుగు: అదానీ గ్రూప్ ఎదుగుదలకు మోడీ ప్రభుత్వమే కారణమనే విమర్శలను అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తిప్పికొట్టారు. మోడీ, తానూ గుజరాత్ నుంచే రావడంతో ఇలాంటి ఆరోపణలు, విమర్శలు పుట్టుకొస్తున్నాయని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. తన ప్రొఫెషనల్ కెరీర్ను నాలుగు దశలుగా ఆయన విభజించారు. రాజీవ్ గాంధీ పాలసీలు లేకపోతే తాను ఈ పొజిషన్లోనే ఉండేవాడిని కాదని అన్నారు. ‘రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తన జర్నీ స్టార్టయ్యింది. ఎకానమీ పాలసీని ఆయన లిబరలైజ్ చేసినప్పుడు చాలా ఐటెమ్స్ను ఓపెన్ జనరల్ లైసెన్స్ పాలసీ కిందకు తెచ్చారు. దీంతో లాభపడిన వారిలో నేను ఉన్నాను. నా ఎంటర్ప్రెనూర్ జర్నీ రాజీవ్ గాంధీ లేకపోతే మొదలయ్యేది కాదు. ప్రధాని నరసింహరావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ 1991లో తీసుకొచ్చిన ఎకానమీ సంస్కరణలు నాకు రెండో టర్నింగ్ పాయింట్గా మారాయి. మిగిలిన ఎంటర్ప్రెనూర్ల మాదిరే నేను కూడా లాభపడ్డాను. మూడో టర్నింగ్ పాయింట్ 1995లో కేసూబాయ్ పటేల్ గుజరాత్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక వచ్చింది. అప్పటి వరకు గుజరాత్ డెవలప్మెంట్ అంతా నేషనల్ హైవే ముంబై–ఢిల్లీ దగ్గర జరిగేది. ఆయనొక విజినరీ. కోస్టల్ డెవలప్మెంట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన తెచ్చిన పాలసీల వలన ముంద్రా నిర్మించాం. మిగిలినది అంతా హిస్టరీ. నాలుగో టర్నింగ్ పాయింట్ 2001లో మోడీ గుజరాత్ సీఎంగా మారిన తర్వాత వచ్చింది. మోడీ డెవలప్మెంట్పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆయన పాలసీల వలన ఎకానమీ మారడంతో పాటు, సోషల్గా మార్పు వచ్చింది. గతంలో డెవలప్ కాని ఏరియాలు కూడా డెవలప్ అయ్యాయి. ఇండస్ట్రీలు రావడంతో పాటు ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఈరోజు ఆయన లీడర్షిప్లో ఇలాంటి ఫలితాన్నే నేషనల్గా, ఇంటర్నేషనల్గా చూస్తున్నాం’ అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. చాలా మంది తనపై విమర్శలు చేయడం దురదృష్ట కరమని, ఈ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. షార్ట్ టర్మ్లో తమ గ్రూప్ సక్సెస్ కావడంతో చాలా మందికి మింగుడు పడడం లేదని పేర్కొన్నారు. నా ప్రొఫెషనల్ సక్సెస్ కేవలం ఏ ఒక్క వ్యక్తి వలన జరగలేదని, కానీ, సంస్థాగతంగా గత 30 ఏళ్లలో ప్రభుత్వాలు తీసుకున్న పాలసీలు, సంస్కరణల వలన జరిగిందని వివరించారు.
బ్యాంకులు కాదు.. బాండ్ మార్కెట్ నుంచే
ప్రభుత్వ బ్యాంకులతో సహా వివిధ బ్యాంకుల నుంచి అదానీ గ్రూప్ పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుందన్న వాదనలపై గౌతమ్ అదానీ స్పందించారు. ‘నిజాలు తెలుసుకోకుండా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. నిజమేంటంటే 9 ఏళ్ల క్రితం మా అప్పుల్లో 80 శాతం వాటా ప్రభుత్వ బ్యాంకుల నుంచే ఉండేది. ప్రస్తుతం ఈ వాటా 32 శాతానికి తగ్గింది. 50 శాతం మా అప్పులు ఇంటర్నేషనల్ బాండ్ల ద్వారా వచ్చాయి. ఇంటర్నేషనల్ లెండర్లు అన్ని చూసుకున్నాకనే డబ్బులు ఇస్తారు’అని పేర్కొన్నారు. తాము ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్గా ఉన్నామని, సెక్యూర్గా ఉన్నామని అన్నారు. ‘ఇలాంటి కామెంట్స్ రెండు కేటగిరీ వాళ్లు చేస్తున్నారు. ఒకరు డెట్, ఫైనాన్షియల్ డిటెయిల్స్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని వారు. వీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇలాంటి విమర్శలు చేయరు. మరొక వర్గం వారు కావాలనే ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. తప్పుదోవ పట్టిస్తున్నారు. గత 9 ఏళ్లలో మా ప్రాఫిట్ రెండింతలు పెరిగింది. దీంతో మా డెట్ ఎబిడిటా రేషియో 7.6 % నుంచి 2.3.2 శాతానికి తగ్గింది. ఇది చాలా మంచిది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లోని కంపెనీలకు వచ్చే క్యాష్ ఫ్లోస్ క్లియర్గా ఉంటాయి’ అని అన్నారు.
ధీరూబాయ్ అంబానీనే ఇన్స్పిరేషన్
‘ధీరూబాయ్ అంబానీ లక్షల మంది ఎంటర్ప్రెనూర్లకు ఇన్స్పిరేషన్. ఎటువంటి రిసోర్స్లు లేకపోయినా అన్ని రకాల అడ్డంకులను దాటి వరల్డ్ క్లాస్ బిజినెస్ను ఎలా క్రియేట్ చేయొచ్చో నిరూపించారు. నేను ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను’ అని అదానీ అన్నారు.
సంపద ర్యాంకింగ్లను పట్టించుకోను
దేశంలో, ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మారిన గౌతమ్ అదానీ, ఈ ర్యాంకింగ్లను పట్టించుకోనని అన్నారు. ఇవన్నీ మీడియా హైప్ మాత్రమేనని చెప్పారు. ‘నేను మొదటి తరం ఎంటర్ప్రెనూర్ని. ప్రతీది స్క్రాచ్ నుంచి నిర్మించా. సమస్యలను పరిష్కరించడాన్ని థ్రిల్లింగ్గా ఫీలవుతా. నాకైతే ప్రజల జీవన శైలిని మార్చడంలో, దేశాన్ని నిర్మించడంలో అవకాశం దొరికితే ఎక్కువ ఆనందపడతాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడం ద్వారా దేశాన్ని నిర్మించే అవకాశం ఇవ్వడంతో దేవుడికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ ఏడాది నాకు స్పెషల్’ అని అదానీ పేర్కొన్నారు.
ఎన్డీటీవీ ఎడిటోరియల్లో జోక్యం చేసుకోం
మా బిజినెస్లన్నీ ప్రొఫెషనల్స్, సామర్ధ్యం ఉన్న సీఈఓల ద్వారా నడుస్తున్నాయని గౌతమ్ అదానీ అన్నారు. తాను రోజువారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోనని చెప్పారు. ‘స్ట్రాటజీలను తయారు చేయడం,క్యాపిటల్ కేటాయించడం, టాప్ మేనేజ్మెంట్ల పెర్ఫార్మెన్స్ను రివ్యూ చేయడం వరకే నా పని. అందుకే గ్రూప్ను మరింతగా విస్తరించడానికి, కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి, అక్విజేషన్ల కోసం అవకాశాలు వెతకడానికి టైమ్ దొరుకుతోంది’ అని అదానీ పేర్కొన్నారు. ఎన్డీటీవీ ఎడిటోరియల్కు, మేనేజ్మెంట్కు మధ్య లక్ష్మణ రేఖ ఉందని, ఈ రేఖను దాటమని చెప్పారు. తమకు కొంత టైమ్ ఇవ్వాలని, ఆ తర్వాత జడ్జ్ చేయాలని కోరారు.
మోడీ ఒక విజనరీ
ప్రధాని మోడీపై గౌతమ్ అదానీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘ప్రధాని మోడీ ఒక విజనరీ. ఇన్స్పైర్ చేయగలిగే లీడర్. ఆయన కేవలం ఎకానమీ పాలసీలే కాకుండా వివిధ ప్రోగ్రామ్లు, స్కీమ్ల ద్వారా దేశంలోని ప్రతీ ఇండియన్ను టచ్ చేశారు. ఆయన ఎకానమీని మార్చడానికి, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, ఇంక్లూజివ్ గ్రోత్ కోసం కష్టపడుతున్నారు. మోడీ చాలా ఇన్నోవేటివ్ స్కీమ్లను తీసుకొచ్చారు’ అని అదానీ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి స్కీమ్లు దేశ ఎకానమీని మెరుగుపరుస్తున్నాయని అన్నారు. మాన్యుఫాక్చరింగ్ అవకాశాలను క్రియేట్ చేస్తూ లక్షల ఉద్యోగాలు తెచ్చాయని పేర్కొన్నారు.