హైదరాబాద్, వెలుగు: బ్యానర్లు, హోర్డింగ్లపై బల్దియా నిషేధం విధించినప్పటికీ సిటీలో అమలు కావడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా బ్యానర్లు, హోర్డింగ్లను ఏర్పాటు చేసేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా నగరంలో జూన్ 15 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు హోర్డింగ్స్,
యూనిపొల్స్ పై నిషేధం విధించారు. ఉన్నవి తీసేయాల్సిన పరిస్థితుల్లో కొన్ని చోట్ల వివిధ పార్టీల నేతలు కొత్తగా హోర్డింగ్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాద్ ఏరియాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు అనుచరులు, బీజేపీ నేతలు పెద్దఎత్తున బ్యానర్లు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని తొలగిస్తామని జీహెచ్ఎంసీ అడ్వర్టయిజింగ్ విభాగం అధికారి రమేశ్ తెలిపారు. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి రోడ్డులో సిటీలైట్ నుంచి ప్యాట్నీ సర్కిల్ వరకు పెద్దఎత్తున ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు కనిపిస్తున్నాయి.